Modi Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాన నరేంద్ర మోడీ కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో చేర్పులు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. అదే సమయంలో మిత్రులకు సైతం మరింత అవకాశాలు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఏపీలో టిడిపి తో పాటు జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
* టిడిపికి మరొకటి..
ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. బిజెపికి సంబంధించి భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర క్యాబినెట్లో కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించే ఛాన్స్ ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తోంది. అయితే ఈసారి రాయలసీమకు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇవ్వడం ద్వారా రాయలసీమలో మరింత పట్టు బిగించాలన్నది ఆలోచనగా సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు. మరోవైపు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారిలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇంకోవైపు కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రిత్వ శాఖ మార్పుపై కూడా అనేక రకాల ఊహాగానాలు రేగుతున్నాయి. ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగిస్తారన్న టాక్ ఉంది. ఇప్పటివరకు సహాయం మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ఇండిపెండెంట్ హోదా కల్పిస్తారని సమాచారం.
* జనసేనకు అవకాశం..
జనసేనకు కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు లోక్సభలో. మచిలీపట్నంలో వల్లభనేని బాలసౌరి.. కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఎంపీలుగా ఉన్నారు జనసేనకు. అయితే ఈసారి కేంద్ర క్యాబినెట్లో జనసేనకు స్థానం కల్పించాల్సి వస్తే బాల సౌరికి పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి భూపతి రాజు శ్రీనివాస వర్మ మార్పు ఖాయమన్న టాక్ కూడా ఉంది. మార్పు అనివార్యం అనుకుంటే మాత్రం దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
