PM Modi: చంద్రబాబు, పవన్ కు మోదీ నిర్దేశం.. ఏపీలో ఎన్నికల ఫీవర్

దేశంలో ఒకే ఒక్క ఎన్నికలు తేవాలన్నది మోడీ టార్గెట్. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన మోడీ.. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు వ్యతిరేక కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి. మోడీ అనుకున్నట్టు జరిగితే ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారనున్నాయి.

Written By: Dharma, Updated On : October 19, 2024 5:19 pm

PM Modi(4)

Follow us on

PM Modi: ఏపీలో కూటమి నేతల స్వరం మారుతోంది. వారి నోట ఎన్నికల మాట వినిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ఏపీలో కూటమి పార్టీల నేతలు సైతం అందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. తిరుగులేని విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను.. ఏకంగా 164 స్థానాలతో సత్తా చాటింది. వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయ్యింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బిజెపి.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామి అయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరి నాలుగు నెలలు అవుతోంది. కానీ కేంద్రం మాత్రం ఈసారి జమిలికి సిద్ధపడుతోంది. లోక్సభ తో పాటు అన్నిరాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి అత్యున్నత కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికలు కూడా ఇచ్చేసింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి ఆమోదం ముద్ర వేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇండియా కూటమి వ్యతిరేకిస్తుండగా.. భాగస్వామ్య పార్టీలుగా ఉన్న టిడిపి ఆహ్వానించింది. చంద్రబాబు సైతం మద్దతు తెలిపారు.

* ముందస్తు పై జగన్ ఆశలు
అయితే కేంద్ర చర్యలతో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్న విపక్ష నేత జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. 2027 ద్వితీయార్థంలో ఎన్నికలు తప్పకుండా వస్తాయని భావిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వైసీపీకి ఇది మంచి తరుణం అని భావిస్తున్నారు. మళ్లీ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. పార్టీ బలోపేతం పై పూర్తి దృష్టి పెట్టారు. నాలుగు నెలల పాలనలో టిడిపి కూటమి సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్నారు.

* చంద్రబాబు అదే మాటగా
అయితే జమిలి ఎన్నికల విషయంలో చంద్రబాబు కేంద్రపెద్దలకు పూర్తి మద్దతు ప్రకటించారు. హర్యానాలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశ అనంతరం సైతం ఇదే విషయం చెప్పుకొచ్చారు. నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో సైతం ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎక్కువగా తీసుకొచ్చారు. ప్రధాని మోదీ గెలుపు ఫార్ములాను ప్రస్తావించారు. గుజరాత్ లో వరుసగా బిజెపి గెలిచిన వైనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి కొద్దికాలం పాటు ముందుకు సాగితేనే రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యమని తేల్చి చెప్పారు. అందుకే మిగతా రెండు పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అయితే అదే సమయంలో పవన్ సైతం కేంద్ర పెద్దల ఎన్నికల నిర్వహణకు మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ ఆయనకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మోదీ సూచనతో చంద్రబాబు, పవన్ రాజకీయ ఆట ప్రారంభించారు. ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి.