Group1 Candidates: తెలంగాణ ప్రభుత్వం జీవో 55ను సవరిస్తూ జారీ చేసిన జీవో 29 గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్ పూర్తి కావడంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్కు సన్నద్ధమయ్యారు. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది. ఇన్నాళ్లు జీవోపై మాట్లాడని అభ్యర్థులు పరీక్ష సమీపించిన వేళ ఆందోళనకు దిగారు. ఏడు నెలలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు. అక్టోబర్ 21 పరీక్షల ప్రారంభం కానున్న వేళ వారం ముందు ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవో 29 రద్దు చేయాలని గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు సింగ్, డివిజన్ బెంచ్లను ఆశ్రయించారు అభ్యర్థులు. రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. జీవో 29 ని రద్దు చేయాలని జీవో 55నే కొనసాగించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణ సోమవారం జరుపుతామని తెలిపింది. అయితే సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు.
రాజకీయరంగు..
ఇదిలా ఉంటే గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన రాజకీయరంగు పులుముకుంది. త్వరలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిల్లో పట్టభద్రులు కీలకం కానున్నారు. దీంతో విపక్ష బీఆర్ఎస్, బీజేపీలో గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనను ఓన్ చేసుకునేప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల క్రితం గ్రూప్–1 అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్ – 1 అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా జీవో 29 రద్దు చేయాలనే డిమాండ్లో అశోక్ నగర్ నుంచి సెక్రటేరియేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
జీవో 29తో ఎవరికి నష్టం…
ఇదిలా ఉంటే జీవో 29 రద్దుకు గ్రూప్–1 అభ్యర్థులు పట్టుపట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2022లో అప్పటి ప్రభుత్వం దివ్యాంగుల రిజర్వేషన్ల విషయంలో జీవో 55 జారీ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను సవరిస్తూ జీవో 29 ను గత ఫిబ్రవరిలో జారీ చేసింది. అయితే ఈ జీవో కారణంగా అగ్రవర్ణ పేదలకు లబ్ధి కలుగుతుందని, అదరికీ సమానంగా రిజర్వేషన్ ఫలాలు అందవని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని అన్రిజర్వుడుగా పరిగణిస్తే దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మార్కులు ఎక్కువ వచ్చినా రిజర్వేషన్ కేటగిరీగానే పరిగణించి 1:50 నిష్పత్రిలో మెయిన్స్కు పిలవాలని కోరుతున్నారు.
ఏడు నెలలుగా మౌనం..
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం జీవో 29ని ఫిబ్రవరి 8 జారీ చేసింది. అప్పటి నుంచి దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ, పరీక్షల షెడ్యూల్ ప్రారంభానికి వారం ముందు ఆందోళన చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఆందోళనకారుల్లో నిజమైన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో పరీక్షలను నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.