Homeఆంధ్రప్రదేశ్‌Gauthu Shirisha: అది గౌతు లచ్చన్నకు అవమానం.. టిడిపికి భారీ డ్యామేజ్

Gauthu Shirisha: అది గౌతు లచ్చన్నకు అవమానం.. టిడిపికి భారీ డ్యామేజ్

Gauthu Shirisha: తెలుగు రాష్ట్రాల్లో గౌతు లచ్చన్నది ప్రత్యేక స్థానం. స్వతంత్ర సమరయోధుడిగా.. ప్రతిపక్ష నేతగా విలక్షణ పాత్ర పోషించారు గౌతు లచ్చన్న. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన లచ్చన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో తన జైత్రయాత్రను కొనసాగించారు. ఆచార్య ఎన్జీ రంగాను తెచ్చి శ్రీకాకుళం ఎంపీగా గెలిపించిన చరిత్ర ఆయనది. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి ఆయనది.కాంగ్రెస్ పార్టీ పై పోరాటం చేసిన గౌతు లచ్చన్న శతజయంతి వేడుకలను.. అదే కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిందంటే ఆయన ఘనత ఎలాంటిదో అర్థమవుతుంది.ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన తరగతుల వారి గొంతుకగా పనిచేశారు లచ్చన్న. అటువంటి లచ్చన్న విగ్రహ ఆవిష్కరణను రాజకీయం చేయడం దారుణం. గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టిడిపి నేతలతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కానీ దీనిపై తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రెచ్చిపోయి వార్తలు రాయడం మాత్రం దారుణం. అది రాజకీయ వేదిక కాదు.. రాజకీయ పార్టీ సమావేశం కాదు. వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ అన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఈ విషయంలో టిడిపి అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియా కాస్త అతి చేసింది. ఇది ముమ్మాటికి చాలా తప్పిదం.

* ఆమె సోషల్ మీడియా బాధితురాలు
కార్యక్రమానికి హాజరైన గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోషల్ మీడియా బాధితురాలు అన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఓ మహిళా నేతగా ఉంటూ వైసీపీ సర్కార్ వైఫల్యాలపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు షేర్ చేసినందుకు వైసీపీ సర్కార్ వెంటాడింది. సిఐడి ని ప్రయోగించి.. మహిళా నేతని చూడకుండా విచారణ పేరిట చాలా ఇబ్బందులు పెట్టింది. కానీ నాడు పార్టీ పెద్దలతో పాటు ఈ అనుకూల మీడియా ఏం చేసింది. పలాస నియోజకవర్గంలో నాటి వైసీపీ శ్రేణులతో వీరోచిత పోరాటం చేశారు ఆమె. ఈ క్రమంలో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో కుటుంబ సభ్యులు రాజకీయాలనుంచి తప్పుకోవాలని కోరారు. కానీ ధైర్యంతో ముందడుగు వేశారు గౌతు శిరీష. తన తాత విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి ఆమె ఆ కార్యక్రమానికి హాజరు కావడం తప్ప. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనిస్తే.. ఇతర పార్టీలు, ఇతర నేతల విషయంలో జరిగిన దానికంటే ఇది పెద్ద పొరపాటా? అయితే ఇది ఆ కార్యక్రమానికి హాజరైన టిడిపి నేతలను అనుమానించడం కాదు. ముమ్మాటికి సర్దార్ గౌతు లచ్చన్నను అవమానించడమే.

టిడిపి హై కమాండ్, కీలక నేతలు చేసింది వ్యూహాత్మక రాజకీయమా? పార్టీ బలోపేతం లో భాగంగా తీసుకున్న చర్యలా? కానీ ఓ మహనీయుడి విగ్రహ ఆవిష్కరణకు రాజకీయాలకతీతంగా నేతలు హాజరు కావడం.. ఒకే వేదిక పైకి రావడం నేరమా? ఇంతకంటే ఘోరం ఉంటుందా. ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మరో ఆళ్ల నాని, ఇంకో వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత, సామినేని ఉదయభాను ఏ స్థాయిలో టిడిపి శ్రేణులను వేధించారో తెలియదా? నారా లోకేష్ పరువు నష్టం దావా వేయలేదా? అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇది చంద్రబాబుకు తెలిసి జరుగుతోందా? తెలియకుండా జరుగుతోందా? తెలిసి జరిగితే మాత్రం మూల్యం తప్పదు. ఏదో ఒక రోజు ప్రతిపక్ష నేతలతో చంద్రబాబు సైతం వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో మాత్రం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన సైతం సోషల్ మీడియాకు బాధ్యుడవుతారు. ఇది ముమ్మాటికి నిజం. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఇంతటి వివాదాస్పదం కావడానికి ముమ్మాటికి కారణం టిడిపి అనుకూల మీడియా. ఆపై ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అతి చేసింది. దానిని నియంత్రించ లేకపోతే మాత్రం మూల్యం తప్పదు.

* వారందరి విషయాలు ‘ఈనాడు’కు కనిపించలేదా?
ఇదెక్కడి న్యాయమండి. రెడ్ బుక్ లో ఉన్న గుమ్మనూరు జయరాం కు పిలిచి మరి టిక్కెట్ ఇచ్చారు. వివాదాస్పద నేత సానా సతీష్ కు ఏకంగా రాజ్యసభకు పంపించారు. అసెంబ్లీ సాక్షిగా, ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ ఎన్నికల సమయంలో ఏకంగా మాజీ మంత్రి బొత్సను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నారు. ఇవన్నీ తప్పు కానప్పుడు.. తెలుగు లార్జెస్ట్ సర్కులేషన్ పత్రికగా చెప్పుకునే ఈనాడుకు గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కనిపించిందా? గత ఐదేళ్లుగా మార్గదర్శి సంస్థను జగన్ సర్కార్ వెంటాడినప్పుడు ఇదే మహిళా నేత గౌతు శిరీష అండగా నిలబడలేదా? ఆ విషయం ఈనాడు యాజమాన్యం మరిచిపోయిందా? లేకుంటే ఉద్దేశపూర్వకంగా కథనం రాయించారా? వీటన్నింటిని టిడిపి హై కమాండ్ పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం.. చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular