Uttarandhra: ఉత్తరాంధ్రలో భారీ భూ దోపిడీ.. నిగ్గు తేల్చేశారా?

గత ఐదేళ్లుగా వైసీపీ పాలకులు ఉత్తరాంధ్ర పై ఎనలేని ప్రేమ చూపారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. అప్పటి సీఎం నుంచి అతిరథ మహారధులంతా ఉత్తరాంధ్రకు క్యూ కట్టారు.

Written By: Dharma, Updated On : July 2, 2024 11:19 am

Uttarandhra

Follow us on

Uttarandhra: ఉత్తరాంధ్రలో భారీ భూ దోపిడి జరిగిందా? వైసీపీ నేతలు దందాకు దిగారా? వేలాది ఎకరాలు కొల్లగొట్టారా? అందుకే కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టీం రంగంలోకి దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తవ్వే కొద్ది వైసిపి నేతల అవినీతి వ్యవహారాలు బయటపడుతున్నాయని సాక్షాత్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తుండడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక టీం రంగంలోకి దిగిందని.. వారిచ్చిన నివేదికలతోనే ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

గత ఐదేళ్లుగా వైసీపీ పాలకులు ఉత్తరాంధ్ర పై ఎనలేని ప్రేమ చూపారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. అప్పటి సీఎం నుంచి అతిరథ మహారధులంతా ఉత్తరాంధ్రకు క్యూ కట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను తన సంస్థానంగా భావించారు విజయసాయిరెడ్డి. విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడిపారు. భారీ భూదందాకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక్కడే కాదు చాలామంది వైసిపి నేతలు ఉత్తరాంధ్రలో దోపిడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. వాటిని లెక్క తేల్చే పనిలో ప్రస్తుత సర్కార్ పడినట్లు తెలుస్తోంది.ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని 40000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు నాటి ప్రభుత్వ పెద్దల వశమయ్యాయని కూటమి ప్రభుత్వం నియమించిన ఒక ప్రత్యేక అధికార బృందం నివేదికలో తేల్చినట్లు తెలుస్తోంది. అమాయకులను బెదిరించి, కేసులు పెడతామని హెచ్చరించి భూములు లాక్కున్నట్లు సదరు అధికారుల బృందం గుర్తించింది.

విశాఖలో అయితే విజయసాయిరెడ్డి కుటుంబం భారీ భూదందాకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డుకు అలైన్మెంట్ మార్చేశారని.. అదంతా విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులకు కోసమే నన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం విశాఖ నగర పరిధిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసినది విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒక్క ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములను సైతం బలవంతంగా రాయించుకున్నారు అన్న విమర్శలు వినిపించాయి. విశాఖకు చెందిన మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జీవి వెంకటేశ్వరరావు వేలకోట్ల ఆస్తులు, స్థలాలను కొల్లగొట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిపై కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్టులు జరుగుతాయన్న భయంతోనే వీరు పరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా వేల ఎకరాల భూములకు అడ్వాన్స్ చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ ల్యాండ్లను కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందే. దీంతో ప్రభుత్వం ఏం చేయనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.