Mahanadu TDP Ads: మనకు అనుకూలమైన వ్యక్తి పీఠం మీద కూర్చుంటే చాలు ఏదైనా సరే సాగిపోతూ ఉంటుంది. ఏదైనా కాళ్ళ ముందుకు.. కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. పైగా ఆ సమయంలో అంతకు మించి అన్నట్టుగా నగదు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు ఎదురవుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన ప్రభుత్వాలు ఉండడంతో ఈ రెండు పత్రికలకు దండిగా ప్రకటనలు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఈ పత్రికల యాజమాన్యాలు ఫస్ట్ పేజీలను విపరీతంగా ప్రచురిస్తున్నాయి. ఫుల్ పేజీ యాడ్స్ ను రంగురంగులలో ప్రింట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ మహానాడు ని కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు గట్టిగానే క్యాష్ చేసుకున్నాయి.
టిడిపి నేతలు పోటీపడి ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ఆంధ్రజ్యోతి , ఈనాడు పోటీపడి ఫస్ట్ పేజీలు ప్రింట్ చేస్తున్నాయి. మొత్తం జాకెట్ యాడ్స్ వస్తున్న నేపథ్యంలో కోట్లు దండుకుంటున్నాయి. మహానాడు నిన్న ప్రారంభమైంది. తొలి రోజు టిడిపిలో ఉన్న కొంతమంది మంత్రులు.. కీలక నాయకులు ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు.. గురువారం కూడా అదే స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. అందరికీ కూడా ఫస్ట్ పేజాడ్స్ ప్రయారిటీ కావడంతో.. రెండు పత్రికలు జాకెట్ యాడ్స్ కోసం మూడు నాలుగు ఫస్ట్ పేజీలను ముద్రించాయి.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం స్క్వేర్ సెంటీమీటర్ 100ల లో ఉంటుంది.. అలాంటప్పుడు ఈ రెండు పత్రికలు ఒక్కో ఫుల్ పేజీ యాడ్ కు లక్షలలో వసూలు చేస్తూ ఉంటాయి. పైగా ఏపీ మొత్తం ఈ యాడ్స్ పబ్లిష్ అవుతుంటాయి కాబట్టి భారీగానే డబ్బులు వస్తుంటాయి. ప్రింట్ మీడియాకు మార్చి నుంచి మే నెల వరకు కాస్త గడ్డు పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మహానాడు వల్ల ఈ రెండు పత్రికలు పండగ చేసుకున్నాయి. కోట్ల ప్రవాహాన్ని పాలించుకున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో ఇలా ఫుల్ పేజీ యాడ్స్ పబ్లిష్ అవుతూ ఉండేవి. ఇప్పుడు అధికారంలో వైసీపీ లేదు కాబట్టి సాక్షి కరువు కాటకాలలో ఉంది. ఈనాడు.. జ్యోతి కి మాత్రం షడ్రసోపేతమైన భోజనం లభిస్తోంది. ఇంక మూడేళ్ల పాటు ఏపీలో కూటమి అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పండగే పండుగ.
