Vijayawada Jeep Fight Over Girlfriend: ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. సన్నిహితంగా ఉండేవారు. పైగా బడా బాబుల పిల్లలు. ఈ తరుణంలో అమ్మాయి కోసం ఇరువురు విభేదించుకున్నారు. గొడవలకు దిగారు. బహిరంగంగా రోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే ప్రయత్నం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహిత కుటుంబాలకు చెందిన వారిగా పోలీస్ విచారణలో తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్ననే గురువారం రాత్రి విజయవాడ నగరంలో రెండు జీపులు ఎదురెదురుగా పలుమార్లు ఢీకొట్టుకునే ప్రయత్నం చేశాయి. అందులో ఒక వాహనం చక్రం ఊడి పడడంతో అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. అయితే ఇదంతా మత్తులోనే జరిగినట్లు పోలీస్ విచారణలో తేలింది.
* స్నేహితులే శత్రువులుగా మారి..
విజయవాడ నగరంలో రోహిత్, ఓం అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. దాదాపు వారిద్దరూ 20 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారే. నగరంలో పేరు మోసిన వ్యాపార కుటుంబాలకు చెందినవారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న తరుణంలో రోహిత్ కోసం ఆయన గర్ల్ ఫ్రెండ్ వద్ద ఓం తప్పుగా చెప్పాడు అనేది రోహిత్ అనుమానం. తన గురించి ఎందుకు తప్పుగా చెప్పావు అంటూ రోహిత్ ఫోన్ చేసి ఓం ను అడిగాడు. మొన్న గురువారం ఉదయం నుంచి వారి మధ్య ఫోన్లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఓం దమ్ముంటే తన వద్దకు రావాలి అంటూ సవాల్ చేశాడు. దీంతో గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన వాహనంలో వచ్చాడు రోహిత్. వస్తూ వస్తూనే ఇద్దరు వాహనాలను ఢీ కొట్టించారు. వాహనాలతోనే ఫైట్ జరిపారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి రోహిత్ తన వాహనంతో పారిపోయాడు. ఓం మాత్రం దొరికిపోయాడు.
* ఒకరికి పాజిటివ్..
జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఓం మత్తు పదార్థాలు తీసుకుని ఉంటాడని అనుమానించారు. నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా ఒక ఇంజక్షన్ సిరంజితో పాటు ఎలక్ట్రిక్ సిగరెట్ దొరికింది. రోహిత్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మాత్రం నెగిటివ్ వచ్చింది.వారి ఇళ్లల్లో తనిఖీ చేశారు. అయితే ఎక్కడ ఏం పట్టుబడలేదు. కానీ వారి ఫోన్లలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు జోగి రమేష్ కు చెందిన సన్నిహిత కుటుంబాల పిల్లలుగా తెలుస్తోంది. అయితే విజయవాడలో ఇటువంటి కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వ మూలాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.
