TDP state leadership to Kollu Ravindra: రాష్ట్రంలో రకరకాల రాజకీయ ప్రచారాలు జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు సమీపిస్తోంది. దీంతో మంత్రివర్గంలో చేర్పు మార్పులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. అయితే ఎవరిని మంత్రి పదవుల నుంచి తీస్తారో? కొత్తగా ఎవరికి ఇస్తారో? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఉంటుందన్న ప్రచారం మాత్రం నడుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఆది నుంచి టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే బీసీ నేతకు తప్పకుండా ఆ పదవి కేటాయిస్తారని తెలుస్తోంది. ప్రముఖంగా ఓ మంత్రి పేరు వినిపిస్తోంది.
రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా
2014లో రాష్ట్ర విభజన జరిగింది. దీంతో తెలుగుదేశం( Telugu Desam) పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు చంద్రబాబు. ఏపీతోపాటు తెలంగాణకు వేర్వేరుగా రాష్ట్ర అధ్యక్ష పదవులను కేటాయించారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతుండగా రెండు రాష్ట్రాల్లో పార్టీలకు మాత్రం వేర్వేరు అధ్యక్షులను నియమిస్తూ వచ్చారు. 2014లో తొలిసారిగా కిమిడి కళా వెంకట్రావును నియమించారు. ఆయన బిసి కాగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అటు తరువాత కింజరాపు అచ్చెనాయుడుకు ఛాన్స్ దక్కింది. ఆయన సైతం బీసీ. వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. అటు తరువాత 2024 ఎన్నికల అనంతరం పల్లా శ్రీనివాస్ కు ఆ పదవి ఇచ్చారు. ఆయన సైతం బిసి. యాదవ సామాజిక వర్గానికి చెందినవారు.
Also Read: నేను క్షేమం.. బొత్స సత్యనారాయణ!
కొల్లు రవీంద్ర కు బాధ్యతలు..
టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే.. టిడిపి అధ్యక్ష పదవి మార్పు అనివార్యం. అయితే కొల్లు రవీంద్ర( kollu Ravindra) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి టిడిపి రాష్ట్ర పగ్గాలు అందిస్తారని తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయుడు రవీంద్ర. తొలిసారిగా మచిలీపట్నం నుంచి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. 2019లో ఓటమి ఎదురైంది. 2024 లో మాత్రం విజయం సాధించి రెండోసారి మంత్రి పదవి చేపట్టారు. అయితే ఇప్పుడు విస్తరణలో భాగంగా ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.