Kesineni Nani latest news: రాజకీయాల్లో చాలామంది క్షణికావేశాలకు పోతుంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేజేతులా అవకాశాలను కోల్పోతుంటారు. అటువంటి వారే విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడయ్యారు నాని. 2014 నుంచి 2019 మధ్య ఎంపీగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. 2019లో జగన్ ప్రభంజనంలో గెలిచేసరికి తన సొంత ఇమేజ్ అని భావించారు. అందుకే నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. 2024 ఎన్నికలకు రోజుల ముందు టిడిపికి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరి సొంత తమ్ముడు చేతిలో ఓడిపోయారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతటి పరిణామాలకు తన సొంత తమ్ముడు కారణమని.. టిడిపికి గుడ్ బై చెప్పడానికి తన తమ్ముడు కేసినేని చిన్ని వ్యవహార శైలి కారణమని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు కేశినేని నాని.
చంద్రబాబు ప్రోత్సాహంతోనే..
టిడిపి అధినేత చంద్రబాబు కేసినేని నానిని ఎంతగానో ప్రోత్సహించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన నాని ఓడిపోయారు. ఆయనను తెలుగుదేశం పార్టీలోకి రప్పించి కీలకమైన విజయవాడ పార్లమెంట్ సీటును ఇచ్చారు చంద్రబాబు. నాని సైతం చంద్రబాబు నాయకత్వం విషయంలో చాలా గౌరవంగా ఉండేవారు. అయితే 2019లో రెండోసారి గెలిచిన తర్వాత.. తనకు పక్కలో బల్లెం లా తయారయ్యారు సోదరుడు కేసినేని చిన్ని. సొంత ఇమేజ్తో గెలిచానని నాని సైతం కొంచెం నాయకత్వం విషయంలో నిర్లక్ష్యం చేశారు. దానిని క్యాష్ చేసుకున్న సోదరుడు చిన్ని నాయకత్వం మనసులో స్థానం సంపాదించుకున్నారు. క్రమేపి చిన్ని పార్టీ నాయకత్వానికి దగ్గర కాగా.. కేశినేని నాని మాత్రం అలా దూరమైపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలా పొలిటికల్ గా కేశినేని నానికి డ్యామేజ్ జరిగింది. అయితే తాను టిడిపికి దూరం కావడానికి సోదరుడు చిన్ని కారణమని ఆగ్రహంతో రగిలిపోయారు నాని. అదును కోసం ఎదురు చూశారు.
మద్యం కుంభకోణంపై సంచలన ఆరోపణలు..
ఇటీవల మద్యం కుంభకోణం కేసులో కేశినేని చిన్ని కుటుంబం పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న చిన్ని భార్య జానకి లక్ష్మి కి ఈడి నోటీసులు ఇచ్చింది. రేపు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు రాజ్ కసిరెడ్డి. ఆయనతో కేసినేని చిన్ని దంపతులకు చెందిన కంపెనీ వ్యాపార భాగస్వామి అని.. అప్పట్లో మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన సొమ్మును చిన్ని కంపెనీలకు వెళ్ళింది అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎంపీ చిన్ని కుటుంబ పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా చేశారు. ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇప్పుడు ఈడి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో.. మాజీ ఎంపీ కేసినేని నాని మనసు కొంత కుదుటపడింది. తనను ఎలా టిడిపి నాయకత్వం నుంచి దూరం చేశారో.. అదే టిడిపి నాయకత్వం ఎంపీ చిన్నిపై అనుమానపు చూపులు చూసేలా చేశారు నాని. మున్ముందు ఈ పరిణామాలు ఎటు వైపునకు దారితీస్తాయో చూడాలి.
