KCR Jagan political friendship: దేశంలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బిజెపి పాగా వేస్తోంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభావం చూపుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఐదు రాష్ట్రాలు ఉండగా అందులో నాలుగింట కాంగ్రెస్ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఒక్క ఏపీలో మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అదే టిడిపి కేంద్రంలో కీలక భాగస్వామి. జాతీయస్థాయిలో లెక్క కట్టాలంటే ఏపీ కూడా ఎన్డీఏ పక్షం అని అర్థం అవుతోంది. అయితే జాతీయస్థాయిలో అస్పష్టమైన రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ప్రాంతీయ పార్టీల మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దక్షిణాది రాష్ట్రాలే ప్రభావితం చేస్తాయి రాజకీయాలను. అంతలా మారిపోయింది ఇక్కడ సీన్. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండగా.. బిజెపి సైతం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఆ ఒక్క కారణంతో..
ఇప్పటివరకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. బిజెపి విషయంలో సానుకూలంగా ఉండేవారు. కానీ వీరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. ఇప్పుడు ఆయన రాజకీయంగా పై చేయి సాధించారు. ఆపై కేంద్ర పెద్దల సహకారం ఆయనకు ఉంది. అందుకే ఇప్పుడు వారు రూట్ మార్చారు. కాంగ్రెస్ పార్టీతో నేరుగా కలవడం లేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ స్నేహితులతో చేయి కలుపుతున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయనున్నారు. అయితే తమ చిరకాల ప్రత్యర్థి ఎన్డీఏ లో కీలకంగా మారడంతో.. ఆ కూటమిలో ఛాన్స్ లేదని వారికి తేలిపోయింది. అందుకే ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
స్టాలిన్ స్థానంలో విజయ్..
ఇప్పటివరకు కేసీఆర్, జగన్, స్టాలిన్ కలిసి రాజకీయాలు చేసేవారు. పరస్పరంగా రాజకీయంగా ఒకరికొకరు సహకరించుకునేవారు. ఇతర పార్టీల విషయంలో తమ స్వరాష్ట్రంలో ఉన్న పరిణామాలకు అనుగుణంగా నడుచుకునేవారు. కానీ ఇప్పుడు అదే స్టాలిన్ ను కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి విడిచి పెట్టేసినట్టే అని తెలిసిపోతోంది. ఎందుకంటే విజయ్ గెలవడంతో ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు స్టాలిన్ ను మరిచిపోయారు. విజయ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పొలిటికల్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. అయితే అదే విజయ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. కాంగ్రెస్ పట్ల గౌరవభావంతో ఉన్నారు విజయ్. విజయ్ తో స్నేహం చేస్తున్నారు కేసీఆర్, జగన్. ఈ మొత్తం పరిణామాలతో కెసిఆర్ తో పాటు జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినట్టు పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనికి కొంత కాలం పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికల ముంగిట దీనిపై క్లారిటీ వస్తుంది.