Kadapa Jindal Steel Plant: అనకాపల్లి జిల్లాలో( Anakapalli district ) ఆదిత్య మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కడపలోని స్టీల్ ప్లాంట్ నిర్మాణం పై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శంకుస్థాపన చేసినప్పటికీ.. భూ సేకరణ సవ్యంగా చేపట్టలేదు. ఇప్పుడు దాదాపు 3 వేలకు పైగా ఎకరాల భూమిని జిందాల్ పరిశ్రమకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. తద్వారా పరిశ్రమ ప్రారంభానికి సంబంధించి ముందడుగు పడినట్లు అయింది. సదరు జిందాల్ సైతం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనుంది. ఇది నిజంగా వెనుకబడిన కడప లాంటి జిల్లాకు మంచి అవకాశం. అనుబంధ పరిశ్రమల రాకతో వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి.
* దశాబ్దాల కల..
కడపలో( Kadapa) స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నది దశాబ్దాల కల. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నది గత కొన్నేళ్లుగా ఆలోచన. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చబోతోంది. ఈ పరిశ్రమ కోసం సేకరించిన మూడువేల ఎకరాలకు పైగా భూమిని జిందాల్ స్టీల్ ఆంధ్ర పరిశ్రమకు బదలాయించింది కూటమి ప్రభుత్వం. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దశాబ్దాల కల నెరవేరే రోజు ఆసన్నం అయ్యింది. గతంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు చాలా కంపెనీలతో చర్చలు జరిగాయి. అయితే అత్యున్నత ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జిందాల్ స్టీల్ ఆంధ్ర కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ దాదాపు మూడు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిందాల్ స్టీల్ ఆంధ్ర కంపెనీ సుమారు రూ.8,883 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. ప్రధానమైన భూ బదలాయింపు జరగడంతో మిగిలిన పనులు మొదలు పెట్టనుంది జిందాల్.
* కూటమి ప్రభుత్వం ఫోకస్..
వెనుకబడిన జిల్లాగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. శంకుస్థాపన కూడా చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిహారం పంపిణీ పూర్తి అయ్యింది. మరోవైపు ప్లాంట్ కు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రహదారులతోపాటు తాగునీరు అందించాలని నిర్ణయించింది. మొత్తానికి అయితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక ముందడుగు పడినట్లు అయ్యింది.