Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గృహహింసతో పాటు వరకట్న వేధింపులకు గురి చేశారంటూ ఆ కుటుంబంలో 11 మందిపై ఫిర్యాదు చేశారు. అయితే సాధారణంగా ఓ ప్రముఖ కుటుంబం పై ఇలాంటి ఫిర్యాదులు వస్తే అవి సంచలనంగా మారుతాయి. జోగి రమేష్ విషయంలో కూడా అలా జరిగింది అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆయన కోడలు, ఒక విధంగా నవవధువు అయిన మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు సంచలన అంశాలను జోడించారు. తనను భౌతికంగా, మానసికంగా వేధించడమే కాకుండా పలుమార్లు చంపేందుకు ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
* అదనపు కట్నం కోసం..
గత ఏడాది మేలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనతో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు వివాహం జరిగింది. ఆ సమయంలో ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో పాటు కేజీ నర బంగారం, 10 కిలోల వెండి, ఇతర కానుకలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే అదనంగా ఐదు కోట్ల రూపాయల నగదు, ఫార్చునర్ కారుతో పాటు అత్త, ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె పేరుతో ఉన్న ఆస్తులను భర్త రాజీవ్ పేరుతో బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, పెళ్లికి ముందు భర్తకు ఉన్న శారీరక సమస్యలను దాచి పెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మేఘన. ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
* చాలాసార్లు మట్టుబెట్టే ప్రయత్నం..
అన్నింటికీ మించి మేఘనను పలుమార్లు చంపేందుకు ప్రయత్నాలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. బాధితురాలు కూడా అదే చెబుతోంది. ఒకసారి ఇంటి టెర్రస్ పైనుంచి మామ జోగి రమేష్, సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి తోసేయడానికి ప్రయత్నం చేశారు అనేది మేఘన చేస్తున్న ఆరోపణ. గోవా ట్రిప్ కు వెళ్లే సమయంలో కూడా.. బోటు లోంచి నీటిలో నెట్టేయడానికి ప్రయత్నించి.. ఎవరు లేని ప్రాంతంలో వదిలేసి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. హైదరాబాదు నార్సింగి లోని విల్లాకు తీసుకెళ్లి కొట్టి.. కాళ్లతో తన్ని.. దిండుతో ముఖాన్ని నొక్కి చంపాలని చూశారని కూడా ఆమె వాపోయారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో మామ జోగి రమేష్ ముఖంపై దిండు గట్టిగా నొక్కిపెట్టగా.. భక్త రాజీవ్ మెడకు చున్ని బిగించి చంపేందుకు ప్రయత్నం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్టుగా వింటానని కాళ్లపై పడి వేడుకోవడంతోనే తనను ప్రాణాలతో వదిలేసారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆమె స్పష్టం చేయడం విశేషం. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. కానీ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.


