Janasena: జనసేనలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా వైసీపీ నేతలు జనసేనలో చేరుతారని ప్రచారం ప్రారంభం అయింది. చాలామంది వైసిపి నేతలు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారంతా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారిని పార్టీలోకి రప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇటీవల 14 మంది జనసేన నేతలతో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. ఆయనకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలపై మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేశారు. ఆ అనుభవంతోనే పెద్ద ఎత్తున వైసిపి నేతలను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు గెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి ఉన్నవారు, వీధి లేక పార్టీలో కొనసాగుతున్న వారిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
* వైసీపీకి పట్టు..
గ్రేటర్ రాయలసీమ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. దాదాపు 70 వరకు నియోజకవర్గాలు ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి గ్రేటర్ రాయలసీమ అనుకూలంగా ఉంటూ వస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ గ్రేటర్ రాయలసీమలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు చాటుకుంది. 2019 ఎన్నికల్లో మాత్రం ఒక ఐదు స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. మూడు ఎంపీ సీట్లను పొందింది. అందుకే అక్కడ వైసిపిని తక్కువ అంచనా వేయకూడదని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
* ఆ మాజీలంతా..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సొంత జిల్లా ప్రకాశం నుంచి జనసేన చేరికల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఓ నలుగురు జనసేనలోకి వస్తారని టాక్ నడుస్తోంది. ప్రధానంగా కరణం బలరాం, సిద్ధ రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మరొకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా ఉంటుందన్న టాక్ ఉంది. పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతో అవకాశాలు కల్పిస్తామని కూటమి నుంచి వారికి హామీలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో చాలామంది వైసిపి మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన చేరికల కమిటీ చాలా యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించింది. సహజంగానే ఈ పరిణామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
