Janasena Joinings Committee: జనసేనలో చేరికలకు అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కేవలం రాజకీయ పార్టీల నేతలు మాత్రమే కాదు. సమాజం పై ప్రభావం చూపే వివిధ రంగాల ప్రముఖులతో పాటు తటస్థులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్పించేందుకు పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. 14 మంది అత్యంత సీనియర్ నేతలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జాయినింగ్స్ కమిటీని అధికారికంగా నియమించారు. తద్వారా వివిధ పార్టీల్లో ఉన్న మంచి నేతలను, సమాజం పై ప్రభావం చూపే నిష్ణాతులను, వివిధ రంగాల ప్రముఖులను జనసేనలో చేర్పించే కసరత్తు మొదలుపెట్టారు. అయితే నియమించిన ఈ కమిటీలో ఇటీవల పార్టీలో చేరిన నేతలతో పాటు పాతవారికి సైతం అవకాశం కల్పించారు.
* సీనియర్ నేతలకు బాధ్యతలు..
జనసేనలో ఈ హై ప్రొఫైల్ కమిటీలో అన్ని ప్రాంతాల నాయకులకు అవకాశం ఇచ్చారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగం నేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను నియమితులయ్యారు. పార్టీ సీనియర్లుగా ఉన్న కొటికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కురికన రవికుమార్, ఒంపూరు గంగులయ్య, టిసి వరుణ్, ఆరణి మదన్ లకు ఈ కమిటీలు చోటు కల్పించారు.
* త్వరలో కీలక సమావేశం..
మొన్నటి ఎన్నికల ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనలో వివిధ పార్టీల నుంచి నేతలు భారీగా చేరారు. మరి కొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు సమాజంలోని విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్తులను పార్టీలోకి ఆహ్వానించి.. వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో కమిటీ సభ్యులకు సమావేశం కానున్నారు. పార్టీలో చేరికల విషయంలో దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
