Jagan Padayatra: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారా? ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారా? తనను టచ్ చేయాలని అందుకే సవాల్ విసురుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయంగా జగన్ తర్వాత వైసీపీలో కీలకంగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. తరువాత వంతు బిగ్ బాస్ దేనని ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం అదే అనుమానాలతో ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? లేదా? అని పక్కన పెడితే.. ఆయన ఆత్మస్థైర్యంపై గట్టిగానే దెబ్బతీసినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలతో సహా ముందుకు వెళ్లడంతో వైసిపి శిబిరంలో ఒక రకమైన కలవరం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
సిట్ చేతిలో పక్కా ఆధారాలు
ఇటీవల మద్యం కుంభకోణానికి( liquor scam ) సంబంధించి కోర్టుకు చార్జ్ షీట్ దాఖలు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అందులో బిగ్ బాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చింది. మద్యం పాలసీ తయారీ, కేంద్ర సర్వీసులో ఉన్న అధికారిని ఇక్కడికి తెచ్చి బాధ్యతలు అప్పగించడం.. మద్యం సరఫరాదారులతో పాటు డిస్టలరీలను తమ అదుపులోకి తెచ్చుకోవడం, కమిషన్లు ఫిక్స్ చేయడం వంటి వాటిని పక్కా ఆధారాలతో సేకరించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. జగన్ శిబిరంలో ఆందోళనకు ఇదే ప్రధాన కారణం. మరోవైపు ఆది నుంచి ఈ కేసు విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది సిట్. ముందుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ గొయ్యిని తవ్వింది. చుట్టూ ఉన్న నేతలను అరెస్టు చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు అరెస్టు ఖాయమని తేలిపోయింది.
Also Read: ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలట?
అరెస్టు భయంతో..
అయితే తన అరెస్టు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ). బెంగళూరులో ఉంటే తనను అరెస్ట్ చేస్తే.. ప్రజల్లోకి నెగిటివ్ గా వెళ్తుందని.. అదే ప్రజల మధ్య ఉండేటప్పుడు అరెస్టు చేస్తే వారి నుంచి విపరీతమైన సానుభూతి వస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అందుకే ఇప్పుడు ఉన్నఫలంగా పాదయాత్ర మొదలు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి 2028 లో పాదయాత్ర చేపట్టాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. అప్పటివరకు జిల్లాల పర్యటన చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన జిల్లాల పర్యటనకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతులు రావడం లేదు. అందుకే పాదయాత్ర అయితే సుదీర్ఘంగా ప్రజల మధ్య ఉండాల్సి ఉంటుందని.. ఆ సమయంలో తనను అరెస్టు చేస్తే కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
వీలైనంత త్వరగా ప్రజల్లోకి..
2024 ఎన్నికల కు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని పార్టీ శ్రేణులు ఆయనను కోరాయట. కానీ ప్రజలకు విపరీతమైన సంక్షేమ పథకాలు ఇచ్చాం కనుక.. ప్రజలు తనను చూసి ఓటేస్తారని జగన్ భావించారు. కానీ ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులను చూసిన జగన్మోహన్ రెడ్డి.. వీలైనంత త్వరగా పాదయాత్ర మొదలు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.