YSRCP Crisis: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇంకా పాత వాసనలు మరువలేదు. 2014 నుంచి 2019 మధ్య జగన్ చేసిన రాజకీయాలనే మరోసారి చేస్తున్నారు. దీంతో అవి వికటిస్తున్నాయి. అప్పట్లో జగన్ ఏం చెబితే అది జనాల్లోకి వెళ్ళేది. పార్టీ శ్రేణులు అనుసరించేవారు. వ్యూహాలు పనిచేసేవి. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉండేది. అన్నింటికీ మించి ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వన్ చాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను ప్రజలు చూశారు. పదేపదే అవే మాటలు చెప్పడం ద్వారా నమ్మే స్థితిలో లేరు కూడా. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఇటువంటి సమయంలో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై పోరాడి గట్టి పడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పాత రాజకీయాలనే నమ్ముకుంటున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆలోచనలో పడ్డారు.
* చెప్పినా వినరు..
జగన్మోహన్ రెడ్డి చెబితే వినే రకం కాదు. ఫలానా చోటా ఫలానా విధంగా రాజకీయాలు చేయాలి అని చెప్పిన వినరు. ఆ విషయం సీనియర్లకు సైతం తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అలవాటు పడినవారు వేరే పార్టీలో చేరలేరు. అయితే కాంగ్రెస్ నుంచి వేరుపడిన జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. చావైనా రేవైనా పార్టీలోనే ఉండాల్సిన పరిస్థితి కొందరిది. కానీ జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు తన పరిస్థితిని దిగజార్చుకుంటున్నారు. ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్న దానికి యూటర్న్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజధానుల అంశం విషయంలో తరచూ స్టాండ్స్ మార్చుతున్నారు. పార్టీకి అది డ్యామేజ్ చేస్తోంది. కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేకుండా చేయి దాటుతోంది. దీంతో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న వారు కూడా ఉన్నారు.
* కాంగ్రెస్ వైపు..
ఒక్క రాజధాని విషయంలోనే కాదు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు అంతు పట్టడం లేదు. అస్సలు మింగుడు పడడం లేదు. బిజెపితో స్నేహం వద్దు అన్న సీనియర్లు చాలామంది ఉన్నారు. దీంతో మైనారిటీలతో పాటు కొన్ని వర్గాల వారు దూరం అవుతారన్న ఆందోళన ఉంది. కానీ జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల దృష్ట్యా బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు అదే ఎన్ డి ఏ లో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ ప్రభుత్వంలో కూడా బిజెపి భాగస్వామ్యమై ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి వైఖరిని వ్యతిరేకించాల్సింది పోయి.. పరోక్ష స్నేహ హస్తం అందించడం పై సీనియర్లు ఆవేదనతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు కొందరు సీనియర్లు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డిని ఒప్పించి కాంగ్రెస్ వైపు తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే.. ఇదే మాదిరిగా జగన్ ముందుకు వెళితే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరి కొందరు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

