Jagan Warns Kodali Nani: విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. తాడేపల్లి కార్యాలయంలో పార్టీ ముఖ్య లతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలను అప్రమత్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు నిర్వహించాలని భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలు అందుబాటులో ఉండాలని తేల్చి చెబుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి కొడాలి నానిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలాసేపు కొడాలి నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు కొడాలి నాని. ఇకనుంచి యాక్టివ్ కావాల్సిందేనని కొడాలి నాని కి జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త గట్టిగానే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో..
నిలిచిన వైసిపి కార్యక్రమాలు..
మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఐదోసారి పోటీ చేశారు కొడాలి నాని. కానీ రావి వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓడిపోయారు. భారీ మెజారిటీతో గెలిచారు వెంకటేశ్వరరావు. గెలిచిన నాటి నుంచి వెంకటేశ్వరరావు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి గ్రాఫ్ కూడా పెరుగుతుంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఏవి జరగడం లేదు. కనీసం పర్యవేక్షణ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండేళ్ల పాటు కాలం గడిచిపోయింది. కానీ ఇక అలానే విడిచి పెడితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే కొడాలి నాని ని పిలిపించి మాట్లాడారు. యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొడాలి నానికి జగన్ క్లాస్ పీకినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం..
గుడివాడ నుంచి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున.. రెండుసార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కొడాలి నాని. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇంతలోనే అనారోగ్యానికి గురయ్యారు. అయితే కోలుకున్నాక తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారని అంతా భావించారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు. త్వరలో కొడాలి నాని రాబోతున్నారని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు. కానీ ఎప్పటికీ రావడం లేదు కొడాలి నాని. కేసులకు భయపడి రావడం లేదన్న విమర్శ ఉంది.. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. పార్టీలో యాక్టివ్ అవుతావా? లేకుంటే తప్పుకుంటావా? అని అడిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే పార్టీలో దూకుడుగా ఉంటూ చాలా రకాల ఇబ్బందులు పడుతున్న వైనాన్ని కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీకి చావోరేవో లాంటివని.. కచ్చితంగా యాక్టివ్ కావాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
