YS Jagan Mohan Reddy: ఏపీలో ప్రతి రాజకీయ పార్టీపై కులముద్ర ఉంది. ఫలానా పార్టీ ఫలానా సామాజిక వర్గానికి అనుకూలం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. టిడిపికి కమ్మ సామాజిక వర్గం… జనసేనకు కాపు సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న అభిప్రాయం చాలా ఈజీగా అర్థం అవుతుంది. అయితే అన్ని పార్టీల్లో.. అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఉంటారు కూడా. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కమ్మ సామాజిక వర్గం వారిది మాత్రం వింత పరిస్థితి. వారిని రాజకీయంగా చాలా వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థులను వారితో తిట్టించారు. దారుణంగా దూషణలపర్వం నడిపించారు. దీంతో వారికి రాజకీయ జీవితం లేకుండా చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పదిమంది నేతల రాజకీయ జీవితాలను తారుమారు చేశారు జగన్మోహన్ రెడ్డి. చివరకు సొంతవారే అసహ్యించుకునేలా చేయడంలో ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉంది. వారు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళలేరు. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉండవు. అంతలా చేసేసారు జగన్మోహన్ రెడ్డి.
* పాపం దేవినేని అవినాష్..
ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం లో యువనేత దేవినేని అవినాష్ రాజకీయ జీవితంతో ఆటలు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో చేయని తప్పులంటూ లేవు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా టిడిపిలో చేరిన అవినాష్ మంచిగా ప్రోత్సహించాలని చంద్రబాబు భావించారు. అందుకే గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయించారు. అక్కడ ఓటమి చవి చూడడంతో దేవినేని అవినాష్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని పార్టీలో చేర్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసిపి అధికారంలో ఉండడంతో అమరావతిపై విషం చిమ్మడంలో ఆ ప్రాంత నేతల అవసరం ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గం వారిని ప్రయోగిస్తే.. ఆ ప్రాంతంలో రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేసుకున్నారు జగన్. అలా దేవినేని అవినాష్ జగన్ చేతిలో పావుగా మారారు. అమరావతి తో పాటు కమ్మ సామాజిక వర్గం పై జరిగిన కుట్రలో ఆయనను ప్రధాన భాగం చేశారు. ఇప్పుడు దేవినేని అవినాష్ అంటేనే విజయవాడ ప్రాంతంలో ప్రజలు వ్యతిరేకించేలా పరిస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికీ కారణం జగన్మోహన్ రెడ్డి.
* వివాదాస్పద నేతలుగా..
మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లను ఏ స్థాయిలో వివాదాస్పద నేతలుగా మార్చారో తెలియనిది కాదు. వారు బలమైన కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. సహజంగానే వీరి మాటలు కమ్మ సామాజిక వర్గానికి నచ్చవు. దీంతో ఆ ఇద్దరితో వివాదాస్పద ప్రకటనలు చేయించి.. అంతకుమించి తప్పుడు మార్గాల్లో మాట్లాడించి కమ్మ వ్యతిరేకులుగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఆపై బొల్లా బ్రహ్మనాయుడు, తలశిల రఘురాం లాంటి నాయకుల విషయంలో సైతం ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రోత్సాహం అందించలేదు. అందుకే ఇప్పుడు కమ్మ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు. అటువంటి నాయకులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ఆప్షన్ లేదు కూడా. అలా వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా.. మరో మార్గం లేకుండా చేయడంతో వారు.. పొలిటికల్ సైలెన్స్ పాటించాల్సి వస్తోంది.

