YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డికి ఒక కోర్ టీం ఉంది. చాలా దగ్గరగా మెలిగే ఒక బృందం ఉంది. ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ కోర్ కమిటీ లో కీలక వ్యక్తులు చేరుతూ వచ్చారు. నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవారు. కృష్ణమోహన్ రెడ్డి ఓ ఎస్ డి గా వ్యవహరించేవారు. సీఎంగా మారిన తర్వాత ధనుంజయ రెడ్డి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవారు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడిగా మెలిగారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే గట్టి మద్దతుదారుడిగా నిలిచారు. కానీ తాజాగా వీరందరినీ పక్కనపెట్టి కొత్త టీం ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన కలత చెందారట. చుట్టూ వీరిని ఉంచుకొని రాజకీయాలు చేయలేనని భావించి.. కొత్త టీం ను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారట.
* అనేక రకాల ఆరోపణలు..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. వారి తీరుతోనే పార్టీ నేతలకు అధినేతకు మధ్య గ్యాప్ వచ్చిందని విమర్శలు వచ్చాయి. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోర్ టీం పై అనేక రకాల ఫిర్యాదులు ఉన్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి సహజం అని చాలా లైట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అటు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ కోర్ టీం కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయింది. అయితే తనకు అండగా నిలిచినందునే ప్రభుత్వం టార్గెట్ చేసిందని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయో అప్పటినుంచి ఆలోచనలో పడ్డారు.
* సాధారణం అనుకున్నారు..
సాధారణంగా అధికార పార్టీ అంటేనే అవినీతి అనేది ఉంటుంది. ఆ ఆరోపణలు కూడా వస్తుంటాయి. అదే మాదిరిగా తన చుట్టూ ఉన్న కోర్ టీం పై అవినీతి ఆరోపణలు వచ్చి ఉంటాయని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ ఒక్కొక్కరి అక్రమ సంపాదనను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతోంది. మరోవైపు కేంద్ర సంస్థ ఈడీ సైతం వెల్లడిస్తోంది. తన వ్యక్తిగత సహాయకుడి వద్ద వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడేసరికి జగన్ సైతం ఆశ్చర్యపోయారట. తాను ఎంతో నమ్మిన అధికారులుగా తన వద్ద పెట్టుకున్న వారు సైతం భారీగా పోగేసుకోవడాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించారట. అయితే అత్యంత వీర విధేయుడుగా మెలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ సంపాదన చూసి ఆశ్చర్యపోయారట. సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరం చేతికి మట్టి అంటకుండా చేసిన దోపిడీ గురించి తెలుసుకొని జగన్ బాధపడ్డారట. ఇంతకాలం ఇటువంటి వారిని చుట్టూ పెట్టుకున్నానా? అని బాధపడుతున్నారట. అందుకే కోర్ టీం మార్చాలన్న నిర్ణయానికి వచ్చారట.
* పాదయాత్ర నాటికి..
వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయానికి తన చుట్టూ ఉన్న టీం ను మార్చే పనిలో ఉన్నారట. గతంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన సైతం బయటకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు నమ్మకస్తులుగా భావించిన కోర్ టీం నట్టేట ముంచెయ్యడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జగన్ కొత్త టీం లో ఎవరు చేరుతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కోర్ టీంలో ఎవరు చేరుతారు? అనే సందేహాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

