Dharmana Prasada Rao: రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు కొందరు నాయకులు. కానీ ఏపీలో రాజకీయాలు మారిపోవడంతో వారి బాధ అంతా కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి నేతలుగా చలామణి అయ్యారు. చాలా స్వేచ్ఛగా రాజకీయాలు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తో చాలామంది నేతల తలరాతలు మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. పదవులు సైతం ఉన్నా అధికారం వెలగబెట్టలేని పరిస్థితి వారిది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో వారు సతమతం అవుతున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పలుచన అవుతున్నారు. రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారి పోతున్నారు కొంతమంది సీనియర్లు. అటువంటి వారిలో ధర్మాన ప్రసాద రావు ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ధర్మాన.. అదే జగన్మోహన్ రెడ్డి కింద పని చేయాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో జగన్ విధానాలను సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు అవే చేటు తెస్తున్నాయి.
* విశాఖ రాజధానిపై ప్రచారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించారు ధర్మాన ప్రసాదరావు. తొలి మూడేళ్లు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో మౌనమునిగా మారిపోయారు. మంత్రి పదవి ఇచ్చేసరికి యాక్టివయ్యారు. జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనకు విశాఖ పాలన రాజధాని అస్త్రం దొరికింది. గ్రామాల్లో ఏకంగా సభలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కోసం విశాఖను రాజధానిగా చేర్చారని.. ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఆ మాటలను విశ్వసించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు.
* డిఫెన్స్ లో మాజీమంత్రి..
అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో ధర్మాన ప్రసాదరావు లాంటివారు డిఫెన్స్ లో పడిపోయారు. వాస్తవానికి 2014 ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పే మాటకు విశ్వాసం, విశ్వసనీయత ఉండేది. మంచి వాగ్దాటితో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగల నాయకుడిగా పేరు ఉండేది. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. అవి ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో ధర్మాన ప్రసాదరావు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేలా చేశాయి. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విభేదిస్తారన్న కామెంట్ ఉంది. జగన్ వైఖరిని పెద్దగా ఇష్టపడరని కూడా అనుచర వర్గం చెబుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. గత్యంతరం లేని స్థితిలో జగన్ పంచన చేరారు అని కూడా కామెంట్స్ ఉన్నాయి. కానీ అదే జగన్ విధానాలను బలంగా బలపరిచి ధర్మాన ప్రసాదరావు మరింత బలహీనం అయ్యారు. విశాఖ రాజధాని విషయంలో అతి చేశానని.. మావిగన్ స్టాండ్ తో జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతీశారన్న ఆవేదనతో ఉన్నారట ధర్మాన. చూడాలి ధర్మాన ఎలా ముందుకు వెళ్తారో..

