Jagan: ఏపీలో( Andhra Pradesh) పొలిటికల్ హీట్ నెలకొంది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కాపుల అంశం తెరపైకి వచ్చింది. అంబటి రాంబాబు కాపు కావడం వల్లే కేసులతోపాటు అరెస్టులు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కొత్త కాదు. గతంలో కూడా ఇదే జరిగింది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డంగా పెట్టుకుని లబ్ధి పొందింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చేయాలని భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభంను మరోసారి ప్రయోగించారు. అయితే దానిని తప్పుపడుతున్నారు ముద్రగడ కుమార్తె క్రాంతి. తన తండ్రిని రాజకీయంగా బలి పశువు చేయాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రెడ్లను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపులను రాజకీయంగా వాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైన విద్యగా ఆమె పేర్కొనడం విశేషం.
* అప్పట్లో రిజర్వేషన్ ఉద్యమం..
2014లో తెలుగుదేశం( Telugu Desam) అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం విధ్వంసకర ఘటనకు దారితీసింది. తుని రైలు దహనం జరిగింది. అయితే అప్పటి టిడిపి ప్రభుత్వం పట్ల కాపులలో ద్వేషం పెంచేందుకు ఆ ఘటన దోహదపడింది. పరోక్షంగా ఆ ఉద్యమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసమేనని అప్పట్లో ప్రచారం నడిచింది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ కాపులకు ఐదు శాతం ఈ బీసీ కోటా కింద రిజర్వేషన్లు కల్పించింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఐదు శాతాన్ని రద్దు చేశారు. ముద్రగడ పద్మనాభం సైతం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
* ముద్రగడ పావుగా..
వైసిపి ఐదేళ్ల కాలంలో కాపులకు ప్రత్యేక పథకాలు కానీ వర్తింప చేయలేదు. మరోవైపు వైసీపీకి లబ్ధి చేకూర్చారు అన్న ముద్రగడ పద్మనాభంకు కూడా ఎటువంటి పదవులు ఇవ్వలేదు. రాజకీయ ప్రయోజనం కల్పించలేదు. అయితే జనసేనలోకి ముద్రగడ వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి సానుకూలత రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. అప్పటికప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దానినే గుర్తు చేస్తున్నారు ముద్రగడ కుమార్తె క్రాంతి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపులను వాడుకోవడం ఆనవాయితీగా వస్తోందని.. మరోసారి తన తండ్రి ముద్రగడను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ఆమె విమర్శలు చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు రెడ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అదే అధికారం కోసం కాపులను పావుగా వాడుకుంటున్నారు అన్నది ఆమె ఆరోపణ. కాపుల్లో కూడా ఇటువంటి అనుమానాలు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.