Site icon OkTelugu

Jagan: జగన్ వేగంగా చర్యలు

Jagan

Jagan

Jagan: ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే జగన్ తేరుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. వరుస సమావేశాలతో బిజీగా మారారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పొందిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. నాలుగు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. దారుణ పరాజయంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అసలు పార్టీ ఉంటుందా? లేదా? ప్రత్యర్థుల చేతిలో నిర్వీర్యం అవుతుందా? అని ఒక రకమైన ఆందోళన మాత్రం ఆ పార్టీలో ఉంది. అందుకే జగన్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు.

వైసీపీ ఓటమి తరువాత ఆయన నేరుగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రజలకు ఎన్నో రకాలుగా మేలు చేసినా.. గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసిన గుర్తించలేదని వాపోయారు. లోపాలను సవరించుకొని ముందుకు వెళ్తామని కూడా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని జగన్ పార్టీ కీలక నేతలు, తాజా మాజీ మంత్రులతో సమావేశం అయ్యారు. ఓటమిపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై పోస్టుమార్టం చేశారు. ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ముందుగా ఓడిపోయిన వారితో సమావేశం నిర్వహించారు. తరువాత ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.పార్టీ ఎంపీలతో, ఎమ్మెల్సీలతో భేటీలు జరిపారు. పార్టీ ఓడిపోయిన 40 శాతం మంది ప్రజలు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని కోట్ల కుటుంబాలు, లక్షలాదిమంది నాయకులు, కార్యకర్తలు వైసిపికి ఉన్న విషయాన్ని పదేపదే గుర్తు చేశారు. మనం ఓడింది కేవలం అసెంబ్లీలో మాత్రమేనని.. శాసనమండలిలో 38 ఎమ్మెల్సీలు ఉన్న విషయాన్ని సైతం జగన్ గుర్తు చేశారు. అటు ఎంపీలు టిడిపికి 16 మంది ఉంటే.. వైసీపీకి 15 మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ తరఫున నలుగురు లోక్సభకు ఎన్నిక కాగా.. రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కలు వేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుదామని.. అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొందామని జగన్ పిలుపునివ్వడం విశేషం. మొత్తానికైతే జగన్ అప్పుడే సత్వర చర్యలు ప్రారంభించారు. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Exit mobile version