Jagan shock to Duvvada: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సెలబ్రిటీ అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి ఒక మహిళ కోసం జరిగిన కుటుంబ వివాదంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఇది తాత్కాలికమేనని.. తిరిగి తాను వైసీపీలో యాక్టివ్ అవుతానని దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఫ్లేవరు, ఫేవర్ కనిపిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సైతం మొన్న ఆ మధ్యన ఏంటి శ్రీనివాస్ అని పలకరించే సరికి పులకించుకుపోయారు దువ్వాడ. ఇక తాను అడిగిందే తరువాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్ మోహన్ రెడ్డి తిరిగి ఆహ్వానిస్తారు అని భావించారు. కానీ ఇటీవల జగన్ వద్దకు వెళ్లిన దువ్వాడకు షాక్ కొట్టే విషయాన్ని చెప్పారు అధినేత. పార్టీలో చేరిక విషయంలో తానేం చేయలేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
దూకుడు కలిగిన నేత..
శ్రీకాకుళం జిల్లాలో దూకుడు కలిగిన నేతగా దువ్వాడ శ్రీనివాస్ కు పేరు ఉంది. దశాబ్దాల కిందట నుంచి కాంగ్రెస్లో రాజకీయాలు నడుపుతూ వచ్చారు. కానీ ఎందుకో చట్టసభలకు మాత్రం వెళ్లలేకపోయారు. కానీ ఆ ముచ్చట తీర్చారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడంతో శాసనమండలిలో అడుగుపెట్టారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా మూడుసార్లు ఛాన్స్ ఇచ్చారు. ఒక్కసారి కూడా నెగ్గుకు రాలేకపోయారు దువ్వాడ శ్రీనివాస్. కానీ కింజరాపు ఫ్యామిలీ పై దూకుడుగా అడుగులు వేయాలంటే దువ్వాడ ఉండాల్సిందేనని చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహించారు. కానీ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో పార్టీకి చేటు తెచ్చారు. అందుకే సస్పెన్షన్ వేటు పడింది.
ధర్మాన సోదరుల ప్రమేయంతో..
అయితే ప్రారంభంలో వైసిపి నేతల నుంచి ఏం హామీ వచ్చిందో తెలియదు కానీ.. ఆ పార్టీలో సీనియర్ నేతలైన ధర్మాన బ్రదర్స్ పై ఒంటికాలితో లేచారు దువ్వాడ. దానికి కాస్త కులం రంగు పులిమారు. వైసీపీలోకి వస్తే కాచుకోండి అంటూ తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా వైసీపీ లేకపోతే ఇండిపెండెంట్ ప్యానల్స్ తో ఓడిస్తాను అంటూ శపథం కూడా చేశారు. అయితే పార్టీలోకి వస్తానని చెప్పి ఇటీవల జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ శ్రీనివాస్ కలిశారట. అయితే ధర్మాన సోదరులు పావులు కాదపడంతో జగన్మోహన్ రెడ్డి నో అని చెప్పారట. అయితే మొన్నటికి మొన్న తన వెనుక నిలిచిన వైసిపి పెద్దలు సైతం ఇప్పుడు ముఖం చాటేసారట. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల రాజకీయ ప్రకటనలు చేయలేదు. మరి జగన్ నో చెప్పిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.