Mudragada Padmanabham: కాపుల విషయంలో చాలా వేగంగా స్పందిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ విషయంలో మాత్రం ఆలస్యం చేసింది. ముద్రగడ పద్మనాభం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనను జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదన్న విమర్శ వచ్చింది. స్వయంగా ముద్రగడ కుమార్తె దీనిపై మాట్లాడుతూ జగన్ వైఖరిని తప్పు పట్టారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారు కానీ.. వైసిపి కోసం పనిచేసిన తన తండ్రి పద్మనాభం ను పరామర్శించేందుకు సమయం లేదా అని నిలదీసినంత పని చేశారు. అటు కాపుల్లో సైతం ఈ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్తున్నారు.
* వైసీపీకి ప్రయోజనం..
ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పరోక్ష కారణం అన్న విశ్లేషణ ఉంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎన్నికల హామీగా కాపుల రిజర్వేషన్ల అంశం పై గట్టి పోరాటం ప్రారంభించారు ముద్రగడ. కాపుల ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ తరుణంలోనే తుని రైలు విధ్వంస ఘటన జరిగింది. దీంతో కాపులు టిడిపి పై వ్యతిరేకత పెంచుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దాని ఫలితమే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తన ఉద్యమాన్ని మూసేశారు. అప్పటి అధికారపక్షంగా ఉన్న వైసిపి కంటే టిడిపి, జనసేన లను టార్గెట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ వచ్చేలా ప్రకటనలు చేసేవారు. అయితే వైసిపి హయాంలో ముద్రగడ ఎటువంటి రాజకీయ లబ్ధి పొందలేకపోయారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని చెప్పి శపధం చేశారు. అలా జరగకపోవడంతో తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. అలా వైసిపి కోసం తన వ్యక్తిగత ప్రతిష్టను సైతం పోగొట్టుకున్నారు.
* అనేక విమర్శలు..
అయితే వైసీపీ నేతగానే ఉంటూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రతిన బూనారు ముద్రగడ పద్మనాభం. అయితే ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. కాపుల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఏడాది కిందట అస్వస్థతకు గురికాగా ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తరలించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి మాత్రం ముద్రగడ అస్వస్థతకు గురి అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్పందన రాలేదన్న విమర్శలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా పరామర్శించిన దాఖలాలు లేకపోవడం పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ తరుణంలో ముద్రగడ కుమార్తె క్రాంతి స్పందించి జగన్ వైఖరిని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాదులో ఉన్న ముద్రగడ పద్మనాభం పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఇంత ఆలస్యం కావడంపై మాత్రం కాపుల్లో ఒక రకమైన ఆవేదన వ్యక్తం అవుతోంది.
