Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ బలం పుంజుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ల మధ్య పెద్ద వైరం నడుస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు టాక్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు నేతల విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలిచారు. అదే సమయంలో రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఓడిపోయారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి మాట నడిచేది చిత్తూరు జిల్లాలో. రాయలసీమలో సైతం ఆయన హవా ఉండేది. అటువంటిది ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారంలో ఉంది.
* పెద్దిరెడ్డి హవా..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఏకంగా కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే సమయంలో సొంత పార్టీ వారు సైతం ఆయన కనుసన్నల్లో ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పేవి కావు. అందుకే అప్పట్లో ఆర్కే రోజాతో పాటు చెవిరెడ్డి లాంటివారు పెద్దిరెడ్డి విషయంలో చాలా గౌరవభావంతో ఉండేవారు. దానికి ప్రధాన కారణం భయం. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ నేతల తీరు మారింది.
* ఇద్దరి మధ్య విభేదాలు..
ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రాయలసీమను చూసేవారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నిత్యం తాడేపల్లి కార్యాలయంలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి విషయంలో పెద్దిరెడ్డి వైఖరి మారినట్లు ప్రచారంలో ఉంది. అదే సమయంలో తాడేపల్లి లో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్ చెవిరెడ్డి ఇస్తున్న సమాచారాన్ని నమ్ముతున్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని.. ఆ ఇద్దరు నేతలను సర్ది చెప్పలేక జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
