Gudlavalleru issue : ఆమె కట్టు కథతో ఇంత రాద్దాంతమా?నలుగురు విద్యార్థుల వివాదమే కారణమా?

మూడు వేల మంది విద్యార్థుల భవిత కష్టాల్లో పడింది. వారి భవిష్యత్తు మనుగడకే ప్రశ్నార్ధకమయ్యింది. అయితే దీనికి నలుగురు విద్యార్థుల మధ్య వివాదమే కారణమని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: Dharma, Updated On : September 4, 2024 4:58 pm

Gudlavalleru issue

Follow us on

Gudlavalleru issue  : ఏపీలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన పెను ప్రకంపనలకు కారణమైంది. బాలికల వసతి గృహంలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం పెను దుమారానికి దారితీసింది. మూడు వేల మంది విద్యార్థుల భవిత పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది. వైసిపి దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చింది.అందుకే ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. జాతీయస్థాయిలో సైబర్ నిపుణులను తీసుకువచ్చి దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కాలేజీ విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చినికి చినికి గాలి వానలా మారి.. నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం.. సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశామన్న హెచ్చరిక వరకు పరిస్థితి వచ్చింది. దాంతోనే సీక్రెట్ కెమెరాలు పెట్టారన్న అనుమానం పెరిగేలా చేసింది.అయితే దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్ సంస్థ సెర్ట్ డైరెక్టర్ సంజయ్ బహ్లు నేతృత్వంలోని నిపుణులు కాలేజీకి చేరుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు, కళాశాల సిబ్బంది సమక్షంలో స్పై డిటెక్టర్లతో పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థుల సెల్ ఫోన్లు, మరో ఇద్దరి లాప్టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ప్రాధమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

* ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర
కేవలం నలుగురు విద్యార్థుల వివాదమే ఈ ఘటనకు కారణం అన్నట్లు పోలీస్ విచారణలో కూడా నిర్ధారణ అయినట్లు సమాచారం. అమ్మాయిలను వలలో వేసుకుని వారితో న్యూడ్ కాల్స్ రికార్డు చేసే ఇంజినీరింగ్ విద్యార్థి ఒకరు.. ప్రియుడితో హోటల్ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు… ఆమె వన్ సైడ్ ప్రేమికుడు ఇంకొకడు.. చెల్లిని మోసం చేసిన స్నేహితుడు అంతు చూడాలనుకున్న విద్యార్థి వేరొకరు.. ఇలా ఈ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులే వివాదానికి కారణమని నిపుణులు, పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

* ట్విస్ట్ ల మీద ట్విస్టులు
కాలేజీలో చదువుతున్న ఒక యువకుడికి అదే కాలేజీలో చదువుతున్న యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ తరచూ న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేవారు. కానీ ఆ యువతీకి తెలియకుండా యువకుడు వాటిని రికార్డ్ చేసేవాడు. ఆ యువకుడి ఫోను స్నేహితుడు ఒకరోజు చూసేసరికి ఆ వీడియోలు కనిపించాయి. వెంటనే ఆ యువకుడు యువతిని ప్రేమిస్తున్న మరో యువకుడు ( వన్ సైడ్ లవర్)కు పంపించాడు. దీంతో సదరు వన్ సైడ్ లవ్ చేస్తున్న యువకుడు ఇదేమిటని యువతిని ప్రశ్నించాడు. దీంతో ఆమె ప్రేమికుడితో మొరపెట్టుకుంది. అయితే ఇంతటి వివాదానికి తన ఫోన్ చూసిన స్నేహితుడే కారణమని భావించాడు. నీ చెల్లెలి వీడియోలు సైతం తన వద్ద ఉన్నాయని స్నేహితుడిని బెదిరించాడు ఆ యువకుడు. దీంతో ఆ యువకుడి స్నేహితుడు వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ పిలిచి విచారించగా సదరు యువకుడి దగ్గర ఏడెనిమిది ఫోటోలు కనిపించాయి. ప్రిన్సిపల్ అందరినీ హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు.

* నాదే కాదు మీరందరిదీ అంటూ హెచ్చరిక
అక్కడకు కొద్ది రోజులు పోయాక ఆ యువకుడితో యువతి ఉన్న మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆమెను తోటి స్నేహితులు ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి ఏంటని నిలదీశారు. అయితే తీవ్ర మనస్థాపానికి గురైన సదరు యువతి.. ‘నావే కాదు మీ వీడియోలు కూడా ఉన్నాయి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా వారు షాక్ కు గురయ్యారు. మీ వాష్ రూమ్లలో నేనే రహస్య కెమెరాలు పెట్టి రికార్డు చేశా.. అని ఆమె బదులిచ్చింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన విద్యార్థినులు ఒకరికొకరు ఆరా తీసే క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది’.. అయితే కేవలం బెదిరించే క్రమంలో.. తన తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలోనే అలా చేశానని విచారణలో సదరు యువతి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిపుణులతో పాటు పోలీస్ దర్యాప్తులకు సైతం ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఇది ఒక నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారంగా నిర్ధారణకు వచ్చారు. కొద్ది రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.