Nara Lokesh Russia visit purpose: పారిశ్రామికంగా ఏపీ సరికొత్త మైలురాళ్లు అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే గూగుల్ నుంచి మొదలు పెడితే పెద్దపెద్ద కంపెనీల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. భారీగా కార్యకలాపాలను సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడితోనే ఏపీ పారిశ్రామిక ప్రస్థానం ఆగిపోవడం లేదు. అంతకుమించి అనేలాగా ఏపీ మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.
పారిశ్రామికంగా ఒక రాష్ట్రం బాగుంటే పెట్టుబడులు బాగా వస్తాయి. ఆ రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తే పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అందువల్లే నారా లోకేష్ దూకుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆయన విదేశాలలో పర్యటిస్తూ.. పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ.. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పిస్తున్నారు. గతంలో దావోస్ లో పర్యటించిన నారా లోకేష్.. అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎం ఓ యు లు కుదుర్చుకున్నారు. ఫలితంగా ఆ కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టింది. రాయలసీమలో వాహనాల తయారీని చేపడుతోంది. గతంలోని రాయలసీమ ప్రాంతంలో కియా పరిశ్రమ ఏర్పాటు అయింది. ఇప్పుడు నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో పేరుపొందిన ఎలిమెంట్ గ్రూప్.. అల్యూమినియం ఉత్పత్తులు తయారుచేసే రూసాల్.. కెమికల్ ఉత్పత్తులు తయారుచేసే రస్కేమ్ వంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వారిని ఆహ్వానించారు.
వారితో సుదీర్ఘ సమయం సమావేశం నిర్వహించిన లోకేష్.. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలమైన పరిస్థితుల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడిల ప్రోత్సాహక అనుమతుల గురించి వివరించారు. ఆ తర్వాత మాస్కో ట్రాన్స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ ను లోకేష్ సందర్శించారు. అక్కడి రవాణా వ్యవస్థ నిర్వహణపై స్థానిక అధికారులను ప్రశంసించారు. ఏపీ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
