Homeఆంధ్రప్రదేశ్‌Janasena: పవన్ ఆ కుట్ర తెలుసుకున్నారా?

Janasena: పవన్ ఆ కుట్ర తెలుసుకున్నారా?

Janasena: జనసేన పై కుట్ర జరుగుతోందా? ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుర్తింపు ఉండదా? ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు జనసేన ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టిడిపి, బిజెపిలకు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో కలిసి బరిలో దిగింది. కానీ కేవలం ఒక చోట మాత్రమే విజయం సాధించింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ సైతం ఓడిపోయారు. కేవలం 5.5% ఓట్లకే జనసేన పరిమితం అయింది. దాని ఫలితంగానే గాజు గ్లాసు గుర్తు ప్రమాదంలో పడింది. ఎన్నికల నిబంధనల మేరకు గాజు గ్లాసు గుర్తు కామన్ సింబల్ జాబితాలో చేరిపోయింది.

ప్రస్తుతం జనసేన పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాలతో పాటు ఆ 21 అసెంబ్లీ సీట్లలో మాత్రమే జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మిగతా చోట్ల ఇండిపెండెంట్ లకు సైతం ఆ గుర్తును కేటాయించడం వివాదంగా మారింది. కూటమి గెలుపు పై ప్రభావం చూపనుంది. అందుకే ఇండిపెండెంట్ లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని ఆ మూడు పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు విన్నవించాయి. ఈ ఎన్నికల్లో జనసేన సాధించే ఓట్ల శాతం బట్టి ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆరు శాతం ఓట్లు సాధిస్తేనే ఆ పార్టీకి గుర్తింపు ఉంటుంది. లేకుంటే గాజు గ్లాస్ గుర్తు పోయినట్టే.. జనసేన పార్టీ గుర్తింపు కూడా ప్రమాదంలో పడుతుందని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఆరు శాతం ఓట్లు దక్కించుకుంటేనే ఆ పార్టీకి గుర్తింపు ఉంటుంది. అంటే పూర్తిస్థాయిలో జనసేన పోటీ చేయనందున.. ఇప్పుడు పోటీ చేస్తున్న పరిమిత స్థానాల్లో 50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే జనసేనకు కేటాయించిన మెజారిటీ సీట్లలో.. గతంలో టిడిపి గెలిచిన దాఖలాలు లేవు.ఓడిపోయిన సీట్లనే జనసేనకు కేటాయించారన్న టాక్ ఉంది. అయితే ఈ లెక్కన అక్కడ గెలుపు ప్రశ్నార్ధకంగా నిలుస్తోంది. ఇటువంటి సమయంలో ఆ 21 అసెంబ్లీ సీట్లలో 50 శాతానికి పైగా ఓట్లు అంటే అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఉండకూడదన్నది చంద్రబాబు లక్ష్యమని.. అందుకే తక్కువ సీట్లు ఇచ్చారని.. అందులో కూడా గెలిచే స్థానాలు ఇవ్వలేదని కాపు నేతల్లో ఒక రకమైన అనుమానం ఉంది. అయితే ఈ కుట్రను పవన్ కళ్యాణ్ గుర్తించారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version