Vishaka Railway Zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ట్విస్ట్.. ఒడిశా కోసం వాల్తేరు డివిజన్ కు ఎసరు!

కేంద్ర ప్రాజెక్టుల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట రాష్ట్ర విభజన జరిగింది. ఏపీకి రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే జోన్ ఏర్పాటు చేయకుండానే.. వాల్తేరు డివిజన్ ఒడిశాలో కలిపేయాలని రైల్వే శాఖ ఆలోచన చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: Dharma, Updated On : August 27, 2024 11:29 am

Vishaka Railways Zone

Follow us on

Vishaka Railway Zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రాష్ట్ర విభజనతో తప్పకుండా జోన్ కేటాయిస్తారని అంతా భావించారు. కానీ గత పదేళ్లుగా ఈ అంశం పెండింగ్లో ఉంది. అయితే తాజాగా రైల్వే శాఖ మంత్రి దీనిపై కీలక ప్రకటన చేశారు. అయితే ఇంకా విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిశాలోని రాయగడకు డివిజన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీంతో వాల్తేరు డివిజన్ రద్దు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త రైల్వే జోన్ ఏర్పాట్లు కీలక మలుపుగా మారే పరిస్థితి ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అన్నది విభజన హామీల్లో ఉంది. కానీ 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018 వరకు టిడిపి ఎన్ డి ఏ లో భాగస్వామ్య పార్టీగా ఉంది. అయినా సరే ప్రత్యేక రైల్వే జోన్ కార్యరూపం దాల్చలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. 2020-21 బడ్జెట్లోనే జోన్ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించారు.అయితే జోనల్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములను గత ప్రభుత్వం ఇవ్వలేదని.. అందుకే జోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. దీంతో కూటమి నేతలు జగన్ తీరును ఎండగట్టారు. ఇది ముమ్మాటికి వైసిపి వైఫల్యమైన అని ఆరోపణలు చేశారు.

*రాయగడ డివిజన్ పనులు ముమ్మరం
ఇక విశాఖ రైల్వే జోన్ పనులు మొదలు పెడతారని అంతా భావించారు. కానీ ఇంకా సన్నాహాలు ప్రారంభించకుండానే.. రైల్వే శాఖ రాయగడ డివిజన్ పనులను ముమ్మరం చేయడం విశేషం. రాయగడలో డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం, సిబ్బంది క్వార్టర్లు, సర్వీస్ భవనం నిర్మించడానికి రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇది కొత్త సందేహాలకు కారణం అవుతోంది. విశాఖలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే.. వాల్తేరు డివిజన్లో కొన్ని ప్రాంతాలపై కోత వేయాలన్నది లక్ష్యం. వాల్తేరు డివిజన్లోని కీలక రైల్వే స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్లో కలపాలన్నది ప్లాన్. అయితే ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ రాయగడలో డిఆర్ఎం కార్యాలయ సముదాయ నిర్మాణానికి సెప్టెంబర్ 24 లోగా టెండర్లు సమర్పించాలని ప్రకటించారు. దీంతో రాయగడ డివిజన్లో.. వాల్తేరు డివిజన్లోని కొన్ని ప్రాంతాలను కలపడం ఖాయంగా తేలింది.

* వాల్తేర్ డివిజన్ తో కొత్త జోన్ పై ఆశలు
విశాఖ రైల్వే జోన్ ను ఈ ప్రాంతీయులు బలంగా కోరుతున్నారు. అదే సమయంలో వాల్తేరు డివిజన్ ను అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన ఎంపీలు సైతం ఇదే ప్రతిపాదనపైన ఢిల్లీ పెద్దలతో చర్చించారు. అయితే ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ఒడిస్సా కు చెందినవారు. ఒడిస్సా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వాల్తేరు డివిజన్ కు కోత విధిస్తున్నారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూనే.. వాల్తేరు డివిజన్ ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. గతంలో ఈ కారణంతోనే జగన్ కొత్త రైల్వే జోన్ విషయంలో తాత్సారం చేస్తూ వచ్చారు. ఆ కోపంతోనే ఒడిస్సా కు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైసిపి పై అపవాదు వేశారు.

* ఆ కారణంతోనే వైసిపి వెనుకడుగు
ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అశ్విన్ వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో వైసీపీ సైతం వాల్తేరు డివిజన్ యధావిధిగా ఉంచుతూ.. కొత్త రైల్వే జోన్ ప్రకటించాలని కోరింది. కానీ అప్పటి రైల్వే శాఖ మంత్రి ఒడిస్సా ప్రయోజనాల కోసం వాల్తేరు డివిజన్లో కోత పెట్టాలని చూశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న వైసిపి రైల్వే జోన్ కోసం విశాఖలో భూములు కేటాయించడంలో జాప్యం చేసింది. అయితే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించకుండానే.. రాయగడ రైల్వే డివిజన్ పనులు మొదలు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది.