CM Jagan: ఏపీలో ఎన్నికలంటే ప్రాంతం, కులం, వర్గం ఇలా రకరకాల లెక్కలు ఉంటాయి. వాటి ఆధారంగానే అభ్యర్థులకు పార్టీలు టికెట్లు ఇస్తాయి. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో అవి ఉన్నప్పటికీ సరికొత్త సమీకరణం అమల్లోకి వచ్చింది. దాన్ని తెచ్చింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సర్వేల పేరుతో, ప్రజల్లో ఉన్న అభిప్రాయం పేరుతో అటువాళ్ళను ఇటు, ఇటు వాళ్లను అటు జగన్ పంపిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి అంతంతమాత్రంగా సంబంధం ఉన్నవారిని బరిలోకి దింపుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ప్రయోగాలు జగన్మోహన్ రెడ్డి చాలానే చేశారు. అయితే ఇలాంటి ప్రయోగాల వల్ల పార్టీలో అత: కలహాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.
ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో టిడిపి- జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఆ స్థానాల్లో కొంత బలంగా ఉన్న అభ్యర్థులను వేరే చోటికి పంపించి.. ఇక్కడి స్థానాల్లో వేరే వారికి అవకాశం కల్పించడం ద్వారా అంతర్గత కీచులాటకు జగన్ తెర లేపాలని ప్రచారం జరుగుతున్నది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో గత రెండు నెలల భవతిలో నలుగురు ఇన్చార్జిలను జగన్ మార్చారు. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీలో ఉన్నారు. అందువల్లే జగన్ గందరగోళం లో పడ్డారని ప్రచారం జరుగుతుంది. సూళ్లూరుపేట, గిద్దలూరు, ఇంకా కొన్ని స్థానాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు 60 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ప్రదర్శించారు. సొంత పార్టీ నాయకులతో గొడవలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వద్దని కిందిస్థాయి క్యాడర్ నెత్తి నోరు మొతుకున్నప్పటికీ జగన్ పట్టించుకోలేదు. పైగా వారికే టికెట్లు ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఇలా మార్చాల్సిన చోట మార్చకుండా.. మార్పు అవసరం లేని చోట మార్చి.. జగన్ గందరగోళాన్ని సృష్టించారని ప్రచారం జరుగుతున్నది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయసాయిరెడ్డి వైసీపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి అక్కడ మంచి పట్టు ఉండేదని తెలుస్తోంది. అప్పట్లో విజయసాయిరెడ్డి వైజాగ్ కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగరవేసేలా చేశారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకులను తొక్కిపెట్టారు. అయితే విజయసాయిరెడ్డి పై కొన్ని అభియోగాలు రావడంతో.. వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఆయనను తప్పించారు. ఆ బాధ్యతను సుబ్బారెడ్డికి అప్పగించారు. ఫలితంగా ఈ ప్రాంతం మీద పట్టు తగ్గుతోందని వైసిపి నాయకులు అంటున్నారు. సుబ్బారెడ్డి వల్ల క్రమశిక్షణ లోపించిందని.. కింది స్థాయి నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయసాయిరెడ్డి తప్పు చేస్తే మందలించాలి.. లేదా శిక్షించాలి. అంతేతప్ప ఉన్నఫలంగా తీసివేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అలాంటివే ఇప్పుడు చోటుచేసుకున్నాయని వైసీపీ నాయకులంటున్నారు. విజయ్ సాయి రెడ్డితో పాటు చాలామంది నాయకులను స్థానభ్రంశం చెందించడం వల్ల ఉత్తరాంధ్రలో తేలిగ్గా ఏ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు.. జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సొంత పార్టీ అభ్యర్థులను ఎవరో ఓడిస్తారని అనుకోవద్దని కార్యకర్తలు అంతర్గతంగా సంభాషించుకుంటున్నారు. ” భంగపడ్డ నాయకులు ఊరికే ఉండరు. అభ్యర్థి ఓడిపోవడానికి చేయాల్సింది మొత్తం చేస్తారు. మరి ఈ అభ్యర్థుల మార్పు జగన్ కు మైలేజ్ అవుతుందా? ప్రతిబంధకం అవుతుందా? మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.