AP Weather Update: వేసవి ప్రారంభమైంది. ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో బంగాళాఖాతం నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు రెండు అల్పపీడనాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. శ్రీలంక వైపుగా కదులుతోంది. ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈనెల 21న మరో అల్పపీడనం ఏర్పడి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా శ్రీలంక తీరం వైపు కదులుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
* 21 నుంచి వర్షాలు..
అల్పపీడనాల ప్రభావంతో ఈనెల 21 నుంచి ఓ మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం నుంచి మూడు రోజులు రాయలసీమ జిల్లాల్లో.. ఈనెల 22 నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో అల్పపీడనాలు, తుఫాన్లు ఉండవు.
* తగ్గని పొగ మంచు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలో విపరీతంగా పొగ మంచు కురుస్తోంది. అయితే తాజాగా అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఎండ తీవ్రత కూడా ఉంది. బుధవారం కర్నూలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 34.4° గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఇవి మరింతగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి, పొగ మంచు తీవ్రత కొనసాగుతోంది. పగటిపూట మాత్రం ఎండల తీవ్రత కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలోనే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో ఉంది.