Gudivada Amarnath: గుడివాడ.. ఇప్పుడు ‘డమ్మీ’ నట?

గుడివాడ అమర్నాథ్ రాజకీయ నేపథ్య కుటుంబం. తెలుగుదేశం పార్టీలో అమర్నాథ్ సుదీర్ఘకాలం కొనసాగారు. విశాఖ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా కూడా ఉండేవారు.

Written By: Dharma, Updated On : February 22, 2024 9:04 am
Follow us on

Gudivada Amarnath: సాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తున్న వారు తమ, తర అన్న బేధం ఉండదు. తమ సహజ శైలిని ప్రదర్శిస్తుంటారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం ఇదే తరహా దూకుడు కనబరుస్తారని వైసీపీలో ఒక టాక్ ఉంది. అదే ఆయన కొంప ముంచిందని ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ కు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. విస్తరణలో చోటు కల్పించారు. దీంతో అతి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చేసరికి జగన్ తర్వాత తానే అన్నట్టు అమర్నాథ్ వ్యవహరించారు. చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్ లపై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. వారిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందు వరుసలో ఉండేవారు. ప్రస్తుతం అమర్నాథ్ నియోజకవర్గం లేని మంత్రిగా జగన్ చేశారు. గాల్లో ఉంచారు. తన తలరాతను జగన్ మారుస్తారని తరచూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో తనకు అలవాటైన నోటి దూకుడును జగన్ పై చేశారని.. అందుకే ఎటూ కాకుండా పోయారని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.

గుడివాడ అమర్నాథ్ రాజకీయ నేపథ్య కుటుంబం. తెలుగుదేశం పార్టీలో అమర్నాథ్ సుదీర్ఘకాలం కొనసాగారు. విశాఖ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా కూడా ఉండేవారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. తొలి ఎన్నికల్లో పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. కానీ మొన్న అనకాపల్లి టికెట్ కు జగన్ చెప్పడంతో సైలెంట్ కావాల్సి వచ్చింది. అయినా సరే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయకపోతారా అన్న ఆలోచన చేశారు. కానీ జగన్ అమర్నాథ్ కు ఎక్కడా అవకాశం లేదన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

తాజాగా అమర్నాథ్ కు మరో అవమానం ఎదురైంది. కనీసం ఆయనను మంత్రిగా కూడా జగన్ గుర్తించడం లేదు. ఇదే విషయం తాజాగా స్పష్టమైంది. ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. జిల్లాకు ఎవరైనా ప్రముఖులు వస్తే ప్రోటోకాల్ ప్రకారం అన్నీ తానై చూసుకునేవారు. ప్రధాని మోదీ పర్యటనలో సైతం అమర్నాథ్ హడావిడి నడిచింది. ఇక సీఎం జగన్ విశాఖ వస్తే అమర్నాథ్ సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈసారి ప్రముఖులు వస్తే ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన పనిలేదని అమర్నాథ్ కు ప్రభుత్వం తేల్చి చెప్పింది. విశాఖకు ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ రానున్నారు. ఆయనకు స్వాగతం చెప్పే బాధ్యతను మరో మంత్రి బూడి ముత్యాల నాయుడుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు స్వాగత మంత్రిగా ఉన్న అమర్నాథ్ కు ఇది అవమానకరమే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు లేదని వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. అమర్నాథ్ నోటి దురుసుతోనే ఈ కష్టాలు తెచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ అవమానాన్ని అమర్నాథ్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.