Godavari Pulasa: వర్షాకాలం ప్రారంభంలో దేశంలో మిగతా ప్రాంతాలు ఒక ఎత్తు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతాలు మరొక ఎత్తు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జరిగే చర్చ మొత్తం ఒక చేప చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ చేప వలకు పడిందా మత్స్యకారుల పంట పడినట్టే.. ఎందుకంటే దానికి ఉండే డిమాండ్ అలాంటిది. దానికోసం మహామహులు సైతం ఎదురుచూస్తుంటారు. దానిని తినాలని పరితపిస్తూ ఉంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ లో పనులు జరగాలంటే ఈ చేపల కూర తీసుకెళ్తే సరిపోతుంది.. అనే టాక్ అప్పట్లో ఉండేది. దీనినిబట్టి ఆ చేపకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ చేప ట్యూనా కాదు.. అంతకుమించిన సొర కాదు.. కేజీ కి మించి బరువు పెరగని పులస.. పుస్తెలు అమ్మయినా సరే పులస కొనుగోలు చేయాలని ఉభయ గోదావరి జిల్లాలలో ఒక సామెత ఉంటుంది. ఎందుకంటే ఈ చేప రుచి అలా ఉంటుంది మరి. పులస సముద్రంలో పుడుతుంది. కాలక్రమంలో గోదావరి నదికి ఎదురు ఈదుతూ వస్తూ ఉంటుంది. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది. గోదావరి నదిలో నీరు అత్యంత తీయగా ఉంటుంది. ఆ తీపి రుచి కోసం పులస గోదావరి నదికి వస్తూ ఉంటుంది. వర్షాలు కురిసేటప్పుడు గోదావరి నదిలోకి కొత్త నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం ఎర్రగా ఉంటుంది. ఆ నీటికి ఎదురు ఈదుతూ వచ్చిన పులస సరికొత్తగా మారుతుంది. కొత్తనీరు అందులోను తీపి నీరు స్వీకరించడం వల్ల దాని శరీరం లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ చేప మాంసం ఆ స్థాయిలో రుచిగా ఉండడానికి కారణం కూడా అదే. గోదావరి నదికి ఎదురు ఈదుతూ వచ్చిన ఈ చేప ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది.
మత్స్యకారుల వలకు చిక్కిన తర్వాత పులసలను వేలం వేస్తూ ఉంటారు. వేలం 3000 నుంచి మొదలవుతుంది.. కొన్ని సందర్భాల్లో అది రికార్డు స్థాయికి చేరుకుంటుంది.. గరిష్టంగా 50,000 వరకు కూడా వెళ్తూ ఉంటుంది. గోదావరి నీరు వల్ల పులస చేప తన రూపును మార్చుకుంటుంది. అందువల్లే దాని మాంసానికి అంత రుచి ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాలో పులస చేపను ప్రత్యేకంగా వండుతుంటారు. పచ్చి మామిడి లేదా బెండకాయలు వేసి.. చింతపులుసు.. ఇతర పదార్థాలు వేసి చేపల కూరను మరింత గొప్పగా వండుతారు. ఈ కాలంలో గోదావరి కొత్త నీరు వచ్చినప్పుడు పులస చేపలు విరివిగా పడుతూ ఉంటాయి. ఎండి పులస చేపలు పడినా సరే డిమాండ్ ఏ మాత్రం తగ్గదు.. పైగా ముందుగానే ఆర్డర్లు ఉంటాయి. కొన్ని సందర్భాలలో అమెరికా వంటి దేశాలకు కూడా పులస చేపను ఎగమతి చేస్తారు. పులస చేపలు వలలో పడితే మత్స్యకారుల పంట పండినట్లే. ఎందుకంటే దానికి ఉండే డిమాండ్ అటువంటిది మరి.
