Pawankalyan : గాజువాకా.. భీమవరమా? పవన్ ఆప్షన్ ఏంటి?

వారాహి తొలియాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించారు. అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి భీమవరం వరకూ చేపట్టారు. గోదావరి జిల్లాల సెంటిమెంట్ ను కొనసాగించారు. అందుకే ఈసారి గోదావరి జిల్లాల నుంచే పోటీచేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కాకినాడ రూరల్, పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో ఏదో ఒక ఆప్షన్ తప్పదన్న టాక్ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో త్వరలో దీనిపై స్పష్టత రానుంది. 

Written By: Dharma, Updated On : July 2, 2023 4:49 pm
Follow us on

Pawankalyan :  వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు హాట్ ఫేవరెట్ గా నిలవనున్నాయి. అందులో గాజువాక ఒకటి. ఇక్కడ నుంచి పవన్ మరోసారి బరిలో దిగాలని జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. గాజువాకతో పాటు భీమవరం నుంచి బరిలో దిగారు. కానీ రెండు చోట్ల ఓటమే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం తాను గెలవడమే కాకుండా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను జనసేన తరుపున గెలిపించుకుంటానని పవన్ చెబుతున్నారు. అయితే ముందుగా పవన్ పోటీచేసే నియోజకవర్గాలు ఏవీ అన్న చర్చ నడుస్తోంది.

పవన్ పోటీచేసే నియోజకవర్గాలు ఇవి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పది నియోజకవర్గాల గురించి చర్చ నడుస్తోంది. విశాఖ ఉత్తరం, గాజువాక, కాకినాడ రూరల్, పిఠాపురం, భీమవరం, తిరుపతి.. ఇలా జాబితా ఒకటి ఉంది. ఆ నియోజకవర్గ జన సైనికులు పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నారు. అక్కడ నుంచి పోటీచేస్తే గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన గాజువాక నుంచి పవన్ పోటీ అన్నది సస్పెన్స్ గా మారింది. గత నాలుగేళ్లుగా పవన్ గాజువాక రెండుసార్లు మాత్రమే వచ్చారని.. ఆయన మనసంతా ఇప్పుడు గోదావరి జిల్లాల వైపు మళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా భీమవరం నుంచి బరిలో దిగే అవకాశాలు ఎక్కువ అని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అయితే ఈసారి పవన్ ఎక్కడి నుంచి పోటీచేసినా గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. అటు టీడీపీతో పొత్తు ఉండడం, గత ఎన్నికల్లో పవన్ ను ఓడించి తప్పుచేశామని ప్రజల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. పవన్ లాంటి నాయకుడు బయట ఉంటేనే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. అదే చట్టసభల్లో ఉంటే ఆ పరిస్థితి వేరేగా ఉండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీచేసినా గెలిపించుకోవాలన్న స్థిర నిర్ణయానికి వచ్చారు.  తమ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని స్వయంగా ఆహ్వానిస్తున్నారు.

మొన్నటి వారాహి యాత్రతో వైసీపీ విముక్త గోదావరి జిల్లాలకు పవన్ పిలుపునిచ్చారు. వారాహి తొలియాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించారు. అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి భీమవరం వరకూ చేపట్టారు. గోదావరి జిల్లాల సెంటిమెంట్ ను కొనసాగించారు. అందుకే ఈసారి గోదావరి జిల్లాల నుంచే పోటీచేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కాకినాడ రూరల్, పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో ఏదో ఒక ఆప్షన్ తప్పదన్న టాక్ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో త్వరలో దీనిపై స్పష్టత రానుంది.