Gade Sai Krishna Case: కనిపించకుండా పోయిన రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ కేసు కు సంబంధించి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం గత మూడు రోజులుగా కృష్ణలంక.. రాణి వారి తోట.. మార్కాపురం.. వంటి ప్రాంతాలలో పరిశీలన జరుపుతోంది. పోలీసులను.. ఇతర సాక్షులను.. సాయి కృష్ణ స్నేహితులను విచారిస్తోంది. కీలకమైన సిసి ఫుటేజ్ సేకరించింది. సాయి కృష్ణ మాతృమూర్తి వాంగ్మూలాన్ని సేకరించింది.
అంతకుముందు సాయి కృష్ణ మాతృమూర్తి విజయవాడ సిపిని కలిశారు. తమ కుమారుడిని పోలీసులు తీసుకొచ్చిన తీరు.. అతడిని పెట్టిన ఇబ్బందులు.. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోవడం.. వాటి విషయాలను పూస గుచ్చినట్టు చెప్పింది. అంతేకాదు సిపికి ఇన్ స్పెక్టర్ నాగరాజు మీద ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాలను సిపి దర్యాప్తు బృందం అధికారులకు తెలియజేశారు. సిపి చెప్పిన విషయాలను కూడా నోట్ చేసుకున్న దర్యాప్తు బృందం పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు.
ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ మాతృమూర్తిని పరామర్శించారు. న్యాయం జరిగే విధంగా చూస్తామని మాట ఇచ్చారు. అంతేకాదు కృష్ణలంక ఇన్ స్పెక్టర్ నాగరాజు ను సస్పెండ్ కూడా చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ అత్యంత వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే మూడు రోజులపాటు అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. మరి కొద్ది రోజుల్లో కీలక విషయాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఇది ఇలా సాగుతుండగానే ఇన్ స్పెక్టర్ నాగరాజు ను అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి.. నిన్నంతా మీడియాలో ఇదే వార్తలు సంచలనం కలిగించాయి. అయితే నాగరాజును అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఊహించిన విధంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. హత్య నేరం కింద ఆయన మీద కేసు నమోదు అయిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆయనను రాబిన్ హుడ్ మాదిరిగా అక్కడ యువత జేజేలు పలుకుతోంది. యువత… మహిళలు అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఆయన ఇంటికి భారీగా వస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని నినాదాలు చేస్తున్నారు.
ఇన్ స్పెక్టర్ నాగరాజు కృష్ణలంక లో బాధితులు స్వీకరించిన తర్వాత అక్కడ అమ్మాయిలు.. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కొంతకాలంగా ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం కొనసాగుతోంది. నేరాలు చేసిన వారి విషయంలో కఠినంగా ఉన్నారని అక్కసుతో నాగరాజు మీద చర్యలు తీసుకోవద్దని అక్కడి మహిళలు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో కూడా నాగరాజును కీర్తిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు అండగా చాలామంది నిలిచారు. అంతేకాదు బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు రకరకాల మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
