YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదంఫై వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు నూనె కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ. గుజరాత్ కు చెందిన ఓ ల్యాబ్ లో నిర్ధారణ కావడంతో ఈ విషయాన్ని బయటపెట్టింది టిడిపి. వైసిపి హయాంలోనే ఇదంతా జరిగిందని ఆరోపణలు చేసింది. సీఎం చంద్రబాబు సైతం దీనిపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్లు గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు హైకోర్టులో హౌస్ మాషన్ పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు సీఎం జగన్ తాజాగా స్పందించారు. సీఎం చంద్రబాబు ఆరోపణలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారని ఆరోపణలు చేశారు.ఇప్పటికే టీటీడీ పవిత్రత దెబ్బ తీసేలా జగన్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుందని ధార్మిక సంఘాలు గతంలో అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు నేరుగా ప్రభుత్వం.. వైసిపి హయాంలో జరిగిన తతంగాన్ని బయటపెట్టడంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. వైసిపి హయాంలో ఇదంతా జరిగిందని ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఆ పార్టీకి డ్యామేజ్ జరిగింది. అందుకే దిద్దుబాటు చర్యలకు జగన్ ఉపక్రమించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా కుట్రగా అభివర్ణించారు.
* వంద రోజుల్లో ఏమీ చేయలేక
ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. ఈరోజుతో కూటమి వంద రోజుల పాలన పూర్తవుతుంది. అయితే ఇప్పటివరకు హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని.. దానిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు లడ్డూల వ్యవహారాన్ని బయటకు తెచ్చారని జగన్ ఆరోపిస్తున్నారు. వంద రోజుల తరువాత ఎందుకు బయట పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ కల్తీ వ్యవహారం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు జగన్.
* ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం
చంద్రబాబు 100 రోజుల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయని జగన్ విమర్శలు గుప్పించారు. తాను ఢిల్లీ వెళ్లి ఏపీలో శాంతిభద్రతల పై ధర్నా చేస్తే.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనాన్ని తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. కేవలం స్కాములలో తనను అరెస్టు చేశారన్న కోపంతోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వెంటాడుతున్నారని ఆరోపించారు. ముంబై నటిని తీసుకొచ్చి మరోసారి డైవర్షన్ కు తెర తీశారని ఆరోపించారు జగన్.
* భగవంతుడిని వాడుకుంటారా
రాజకీయాల కోసం భగవంతుడిని కూడా వాడుకోవడం ఏంటని జగన్ ప్రశ్నించారు. తిరుపతి లడ్డు తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు అనేది కట్టుకథగా అభివర్ణించారు. ఎంతటి నీచమైన పనిని ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా వచ్చి అబద్ధాలు చెప్పడం ఏంటని నిలదీశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని.. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వాస్తవానికి జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారని.. ఆ సమయంలో సీఎం గా చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. జూలై 17న శాంపిళ్లను గుజరాత్ ల్యాబ్ కు పంపించారని.. జూలై 23న రిపోర్టు వచ్చిందని… కానీ ఇప్పుడు బయట పెట్టడం ఏంటని జగన్ ప్రశ్నించారు. అయితే ఇప్పటికే వైసీపీ హయాంలో ఈ ఘటన జరిగిందన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఇందులో తమ తప్పేమీ లేదని… కూటమి ప్రభుత్వం హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పే ప్రయత్నం చేయడం విశేషం
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More