Firebrand leader shocks YSRCP: అధికారంలో ఉన్నప్పుడు ఏవీ కనపడవు. అధికారం దూరమైన తర్వాత తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పటిదాకా నమ్మిన బంటు మాదిరిగా కల్పించిన నాయకులు శత్రువులు అయిపోతారు. విభేదాలను తవ్వుకుంటూ దూరమైపోతారు.. అందువల్లే రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అంటారు.
ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. ఏకంగా 151 స్థానాలను గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. నాడు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఓ ఫైర్ బ్రాండ్ నేత మంత్రిగా ఉండేవారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. గతంలో టిడిపిలో ఉన్నప్పుడు ఆ నాయకుడు వరుస విజయాలు సాధించారు. కాలక్రమంలో వైసీపీలో చేరిన తర్వాత.. ఆ నియోజకవర్గంలో తన పట్టు మరింత పెంచుకున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆ పార్టీ హవాను తట్టుకొని ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు మంత్రి అయ్యారు. చంద్రబాబును.. ఆయన కుటుంబాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అంతేకాదు, తనకంటూ పార్టీలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. ఆ నాయకుడిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలను బయట పెట్టడం మొదలుపెట్టింది.. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆ నాయకుడు కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇక ఇటీవల నియోజకవర్గానికి ఆయన వచ్చారు. అయితే గతంలో మాదిరిగా ఆయనకు ఘన స్వాగతం లభించలేదు. నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఈసారి ఒక షాకింగ్ వార్త తెలిసింది.
Also Read: 2009 సీన్ రిపీట్ అయితే వైసీపీకి కష్టమే!
ఆ నియోజకవర్గంలో ఆయనను కాకుండా వేరే వ్యక్తిని ఇన్ ఛార్జ్ గా నియమిస్తారని తెలిసింది. బలమైన ఆర్థిక నేపథ్యం.. సామాజిక వర్గం ఉన్నవారిని అన్వేషిస్తుందని ఆయనకు తెలిసింది. గడచిన 3 నెలలుగా ఈ నియోజకవర్గంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే గతంలో ఆ నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని స్పష్టం చేసిన నేపథ్యంలోనే అధిష్టానం ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో కూడా తాను పోటీ చేస్తానని ఆ నాయకుడు ఇటీవల చెప్పారు. అయితే దానికి అధిష్టానం సుముఖంగా లేదని సమాచారం.
“నియోజకవర్గం లో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు. అనుచరులు కూడా తగ్గిపోయారు. అలాంటప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇస్తారు.. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు సముచిత స్థానం కల్పించాం కదా. గత ఎన్నికల్లో పోటీ చేయబోరని ఆయన చెప్పారు కదా.. అలాంటప్పుడు ఇప్పుడు మనసు మార్చుకుంటే ఉపయోగమేముంటుంది. .. విస్తృతంగా చేసిన సర్వేలో ఆయనకు అంత పాజిటివ్ బజ్ లేదు కాబట్టి టికెట్ ఇచ్చేది లేదని” ఆ పార్టీ ఐటీ వింగ్ నేతలు చెప్తున్నారు.
మరోవైపు పార్టీ అధిష్టానానికి అ నాయకుడు హెచ్చరికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజవర్గ బాధ్యతలు ఎవరికైనా ఇస్తే సహకరించేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా పార్టీ అధినాయకత్వం కాస్త వెనుకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతుంది. అందువల్లే మిగతా నియోజకవర్గాల మాదిరిగా.. ఆ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం వేగంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పార్టీ అధిష్టానం వెనకడుగు వేసినంతమాత్రాన వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఎన్నికల వరకు వేచిచూసే ధోరణి అవలంబించి.. ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ నాయకుడు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
