Good news for AP farmers: ఏపీలో ( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్. పిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఆ రెండు పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైతులు పీఎం కిసాన్ కోసం ఎదురుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏపీ ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు నిర్ణయం తీసుకుంది.
ఏటా సాగుసాయం..
నరేంద్ర మోడీ( Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు 6000 రూపాయలను సాగు సాయం కింద అందిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 21 విడతల్లో అందించింది. గత ఏడాది నవంబర్లో పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. అయితే ఈ సంక్రాంతికి ముందు 22వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ వివిధ కారణాలతో వీలు కాలేదు. అందుకే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న పరిస్థితుల్లో పిఎం కిసాన్ నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ ద్వారా సాయం అందుతోంది. ఈ 22వ విడతకు సంబంధించి ఈ నెల 21న ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అన్నదాత సుఖీభవ సైతం..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ కింద 14 వేల రూపాయలు ఏడాదికి అందించేందుకు నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిసి 20000 చొప్పున ఏడాదికి రైతుకు సాగు సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వంతో కలిపి మూడు విడతల్లో అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 7 వేల రూపాయల చొప్పున అందించారు. ఇప్పుడు మూడో విడత 6000 రూపాయలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 21న రైతుల ఖాతాల్లో ఆరువేల రూపాయల చొప్పున జమ కానుంది. ఈ నిర్ణయం పై రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.