Former minister Jogi Ramesh :మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా? ఆయన పార్టీ మారడం ఖాయమా? అయితే ఏ పార్టీలో చేరతారు? తెలుగుదేశం పార్టీలోకా? లేకుంటే జనసేనలో చేరుతారా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన ప్రధాన అనుచరులు సోషల్ మీడియాలో ఈ ప్రచారానికి తెర లేపారు. మా అన్న మారిపోతున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో జోగి రమేష్ పునరాలోచనలో పడ్డారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ టార్గెట్ అయ్యారు. ఆయనతో పాటు కుమారుడిపై కూడా కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కుమారుడు అరెస్టయ్యారు. జైలుకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నివాసం పై దాడి కేసులు జోగి రమేష్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విచారణలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో జోగి రమేష్ పార్టీ మారుతారని ప్రచారం జరగడం విశేషం. కచ్చితంగా తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం కలుగుతోంది.
* జగన్ సన్నిహిత నేత
జోగి రమేష్ జగన్ కు అత్యంత సన్నిహితమైన నేత. జగన్ పై ఈగ వాలనివ్వరు. 2019 ఎన్నికల్లో గెలిచిన జోగి రమేష్ మంత్రి పదవి ఆశించారు. కానీ విస్తరణలో ఆయనకు చాన్స్ ఇచ్చారు జగన్. అయితే చంద్రబాబు నివాసం పై భారీ కాన్వాయ్ తో దండెత్తారు రమేష్. అటు తరువాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్న జోగి రమేష్ చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగేవారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారారు.
* రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంట్రీ
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇచ్చారు జోగి రమేష్. రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. అందుకే వైసిపి ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. అయితే జోగి రమేష్ వైఖరి తెలిసిన వారు ఆయన పార్టీ మారుతారు అని అనుకోరు. కానీ వైసిపి ఇప్పుడు బలహీనంగా ఉంది. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ తరుణంలో పార్టీలో ఉంటే కేసులతో ఇబ్బందులు తప్పవని జోగి రమేష్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు అనుచరులు చెబుతున్నట్టు జోగి రమేష్ పార్టీ మారితే.. ఏ పార్టీలో మారతారు? ఏ పార్టీలో చేరతారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం రాష్ట్రంలో ట్రెండింగ్ లో ఉన్న పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఈ లెక్కను అనుసరిస్తే ఆయన జనసేనలో చేరతారని తెలుస్తోంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ను జోగి రమేష్ టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే జోగి రమేష్ పార్టీలో చేరతారంటే జనసేనాని ఒప్పుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.