El Nino Andhra Pradesh: ఏపీలో వర్షాభావం కనిపిస్తోంది. జూలై రెండవ వారం దాటుతున్న ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. సాగునీటి జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరు లేదు. డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి నిల్వలు. మరోవైపు ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది కానీ.. వర్షాలు లేక ఆశించిన స్థాయిలో పనులు ముందుకు వెళ్లడం లేదు. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి కానీ.. ప్రస్తుతానికి ముఖం చాటేసాయి. వరి విత్తనాలు చల్లి వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం ఖరీఫ్ ప్రమాదకరమే అని అర్థం అవుతోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ వాతావరణ విపత్తుని ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతోంది.
* ముందుగానే హెచ్చరికలు..
ప్రధానంగా ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అది మన రాష్ట్రంపై స్పష్టంగా కనిపించింది. నైరుతి రుతుపవనాల రాక కూడా ఆలస్యం అయ్యింది. జూన్ రెండో వారానికి రాష్ట్రానికి రుతుపవనాలు తాకాయి. తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో మైనస్ 25 వర్షపాతం లోటు నమోదు కాగా.. జూలైలో ఇప్పటివరకు మైనస్ 41 శాతం వర్షపాతం లోటు నమోదయింది. సాధారణంగా జూన్ నుంచి నవంబర్ వరకు నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తాయి. ఖరీఫ్ కు ఇవే ప్రధానం. ఈ సీజన్ మొత్తం మైనస్ 27% వర్షపాతం లోటుతో ముగిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
* ఇది పరిస్థితి..
ఉమ్మడి 13 జిల్లాల్లో 68 మండలాలు ఉన్నాయి. అందులో ఎల్ నినో ప్రభావం 105 మండలాలపై తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 208 మండలాలపై మాత్రం మద్యస్థ స్థాయిలో ప్రభావం ఉండనుంది. ప్రధానంగా శ్రీ సత్య సాయి, అన్నమయ్య, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఉండనుంది.
* మద్యస్థ స్థాయి ప్రభావం కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైయస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలపై ఉండనుంది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేస్తోంది.
