MP CM Ramesh : ఈడి దాడుల వెనుక సీఎం రమేష్.. వైసీపీ నేతల్లో అదే భయం

చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతల్లో సీఎం రమేష్ ఒకరు. బిజెపితో విభేదించిన టిడిపి 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో అసలు విషయం గ్రహించిన చంద్రబాబు సీఎం రమేష్ ను బిజెపిలోకి పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీకి బిజెపిని దగ్గర చేయడంలో సీఎం రమేష్ పాత్ర ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

Written By: Dharma, Updated On : October 20, 2024 1:29 pm

MP CM Ramesh

Follow us on

MP CM Ramesh : బిజెపిని తెలుగుదేశానికి దగ్గర చేయడంలో అనేకమంది పాత్ర ఉంది. అందులో ఒకరు సీఎం రమేష్.ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం దక్కలేదు.రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది.బిజెపికి సంబంధించి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు హై కమాండ్ మంత్రివర్గంలో చోటు ఇచ్చింది.అయితే సాధారణ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో కీలకంగా మారారు. తాజాగా విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎం వివి సత్యనారాయణను టార్గెట్ చేసుకొని ఈడి తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఈడి ఫోకస్ చేయడం వెనక సీఎం రమేష్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం రమేష్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. వైసిపి నేతల అక్రమ సంపాదనలపై ఈడి, సిబిఐలకు తానే ఫిర్యాదు చేశానని.. మాజీ సీఎం జగన్ తో పాటు వైసిపి అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని సీఎం రమేష్ ప్రకటించారు. అయితే ఉత్తరాంధ్ర పై పెత్తనానికి సీఎం రమేష్ తహతహలాడుతున్నారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే సీఎం రమేష్ ను అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజెపితో తెలుగుదేశం పార్టీని కలిపింది ఆయనే. బిజెపి పెద్దలను ప్రభావితం చేసింది ఆయనేనని ఒక టాక్ ఉంది. తెలుగుదేశం పార్టీతో బిజెపి జత కట్టడం వెనుక సీఎం రమేష్ అహర్నిశలు శ్రమించారని తెలుస్తోంది. అటువంటి సీఎం రమేష్ తన ఫిర్యాదుల వల్లే ఈడీ దాడులు జరుగుతున్నాయని చెబుతుండడం విశేషం.

* ప్రశాంత్ కిషోర్ వెనుక
ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపునకు చాలా రకాల అంశాలు ప్రభావితం చేశాయి. అందులో ప్రశాంత్ కిషోర్ జోష్యం ఒకటి. అంతకుముందు ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అదే ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల ముందు చంద్రబాబును కలిశారు. ఈకలయిక వెనుక సీఎం రమేష్ ఉన్నారు.ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలోనే ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారు.చంద్రబాబు ఆతిథ్యాన్ని స్వీకరించి విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.అటు తరువాత జగన్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతున్నారని జోష్యం చెప్పారు. ఒక్క పీకే వ్యవహారమే కాదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల గెలుపు, ఆర్థిక వనరుల సమకూర్పు.. వీటన్నింటి వెనుక సీఎం రమేష్ ఉన్నట్లు ప్రచారం సాగింది.

* ఆ నేతలకు భయం తప్పట్లేదు
అయితే ఇప్పుడు వైసీపీ నేతలకు సీఎం రమేష్ నుంచి కొత్త భయం పట్టుకుంది. కేవలం విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తోనే ఈ దాడులు ఆగుతాయా? లేకుంటే ఉత్తరాంధ్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది వైసీపీ నేతలు సీఎం రమేష్ స్మరణ చేసుకుంటున్నారు. ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికైతే ప్రత్యేక వీడియోతో సీఎం రమేష్ రేపిన కాక ఇప్పట్లో చల్లారేలా లేదు.