Early Southwest Monsoon: దేశ ప్రజలకు చల్లటి కబురు. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. రేపటికి అండమాన్ కు తాకనున్నాయి. క్రమేపి కేరళ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. సాధారణంగా మే 20 తర్వాత అండమాన్ కు.. జూన్ 1 నాటికి ఏపీకి రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది ముందుగానే రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం అవుతాయి. ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవన్న హెచ్చరికల నేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం ఉపశమనం కలిగించే విషయం. మరో రెండు మూడు రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* అల్పపీడనంతో అనుకూలం..
ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఈశాన్యంగా పయనించి కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు మళ్ళింది. వచ్చే 36 గంటల్లో ఇది వాయుగుండం గా మారనుంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో భూమధ్య రేఖ మీదుగా బలమైన తేమగాలులు.. హిందూ మహాసముద్రం దిశగా వీస్తున్నాయి. ఈ అనుకూల పరిణామాలతోనే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ముందుగా కేరళను తాకి మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఎండల తీవ్రత అధికంగా ఉంది. నంద్యాల జిల్లా సంజామలలో 43.3°, కర్నూలు జిల్లా కౌతాళం లో 42.9, అనంతపురం జిల్లా తెరన్న పల్లి లో 42.8, చిత్తూరు జిల్లా రాయలపేట, కడప జిల్లా జమ్మలమడుగు లో 42.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 17 జిల్లాల్లోని 126 మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయింది. శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
