Duvvada Srinivas: పొలిటికల్ సెలబ్రెటీల్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా సంచలనమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్ చేసిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఒకసారి విచారణకు హాజరయ్యారు. సందర్భంగా మాధురి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది దువ్వాడ. ఉదయం పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ సాయంత్రం వరకు అక్కడకు చేరుకోలేదు. ఆయన మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులే దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు చేసి ఎక్కడికో తరలించారని మాధురి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ రాష్ట్రంలో సంచలనాంశంగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంచెం తగ్గినట్టు కనిపించారు. ఇంతలో కుటుంబ వ్యవహారంతో పార్టీ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది.
* స్టేషన్ కు చేరుకోని వైనం..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి మంగళవారం కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉంది దువ్వాడ శ్రీనివాస్. మంగళవారం ఉదయమే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన.. కొత్తూరు స్టేషన్కు చేరుకోలేదని తెలుస్తోంది. ఆయన ఫోన్ తో పాటు డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల అదుపులోనే ఉన్నారని మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ కు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె అనుమానిస్తున్నారు. దీనిపై కొత్తూరు పోలీసులు స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు రాలేదని.. ఆయన కనిపించకుండా పోవడానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లారు అనే దానిపై చర్చ నడుస్తోంది శ్రీకాకుళం జిల్లాలో.
* మాధురి హౌస్ అరెస్ట్..
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అనుచరులు ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా దివ్వెల మాధురిని హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ కు దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరైన క్రమంలో భారీగా ఆయన అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దువ్వాడ మిస్సింగ్ అని తెలియడంతో ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన స్వగృహానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు దువ్వాడ. అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ కు వైసిపి శ్రేణులు సంఘీభావం తెలుపుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.
