Vijayawada: భవాని భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అడుగు తీస్తే అడుగు వేయలేని స్థితిలో దుర్గమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోతుంది. అయితే ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమయ్యింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భవాని మాల ధారణలు పెరిగాయి. లక్షలాదిమంది భక్తులు భవాని మాలను ధరించి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇరుముడులతో వస్తారు. ఎక్కువమంది వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తుంటారు. సాధారణంగా భవానీ భక్తులు చెప్పులు వేయరు. అటువంటి వారు విజయవాడ చేరుకునేసరికి ఆపసోపాలు పడుతుంటారు. కాలికి బొబ్బలు కట్టి నడవలేని స్థితిలో ఉంటారు. అటువంటివారు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఆపసోపాలు పడాల్సిందే. ప్రస్తుతం విజయవాడలో ఎటు చూసినా భవాని భక్తులే. అయితే చాలామంది కాలికి బొబ్బలతో అతి కష్టం మీద నడుచుకోవడం కనిపిస్తోంది.
ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వర్షాల జాడలేదు. ఉదయం 9 గంటలకే రహదారులు మండిపోతున్నాయి. కాలినడకగా వచ్చే భక్తులు ఎండ దాటికి తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు. విజయవాడకు చేరుకునేసరికి చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రధానంగా ఆలయం వద్ద క్యూలైన్ల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలినడకన ఇంద్రకీలాద్రి కి చేరుకునే వారికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కానీ అధికారులు పెడచెవిన పెడుతూ వస్తున్నారు. ఇప్పటికైనా భక్తుల రద్దీ దృష్ట్యా కాలినడక వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ లతో పాటు విజయవాడ నగరంలో విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.