Chandrababu: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపునకు సంబంధించి మరోసారి కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంట్లో పెట్టి వెనక్కి తీసుకుంది కేంద్రం. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురైంది. సాధారణ మెజారిటీ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. కానీ మూడింట రెండో వంతు లేకపోవడంతో మహిళా బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. వెంటనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి తీసుకుంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతోనే ఆ రెండు బిల్లులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అయితే వచ్చే నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రెండు బిల్లులను మరోసారి ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు బిల్లులకు సంబంధించి ఒకదానితో ఒకటి సంబంధం ఉండడంతో.. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం నడుము బిగించినట్లు తెలుస్తోంది.
* అన్ని రాష్ట్రాల్లో సమానంగా..
ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఉత్తరాదితో పోల్చుకుంటే తగ్గుతాయి అన్నది ఒక వాదన. తద్వారా దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ అవకాశాలు పెరుగుతాయి అన్న ఆందోళన ఉంది. ఆ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% నియోజకవర్గాలు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 50 శాతానికి పెంచుతామని.. ఇది అన్ని రాష్ట్రాలకు సమాన వర్తింపు అని చెబుతోంది కేంద్రం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు అనేది జరిగిపోవాలని చూస్తోంది. కానీ ఆ రెండు బిల్లులకు.. మూడంట రెండో వంతు ప్రత్యేక మెజారిటీ అవసరం. ఇప్పుడు ఆ బాధ్యతలను ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం పెట్టినట్లు తెలుస్తోంది.
* ఇతర నేతలతో సంబంధాలు..
దేశవ్యాప్తంగా జాతీయస్థాయి నేతలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వారితో చంద్రబాబు పని చేశారు. అందుకే ఇప్పుడు ఆ రెండు బిల్లులకు అవసరమైన బలం సాధించే బాధ్యతను చంద్రబాబుకు కట్టబెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని.. అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల పెంపు ఉంటుందని చంద్రబాబు జాతీయస్థాయిలో వివిధ పార్టీల నేతలను ఒప్పించనున్నారు. ఈ రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఇది ఉండదని.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమానంగా నియోజకవర్గాల పెంపు ఉంటుంది అని వివరించే ప్రయత్నం చేస్తారు. తనకున్న పరపతిని, పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు ఈ పని పూర్తి చేయాలని కేంద్ర పెద్దలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బిల్లులను ముందుకు తీసుకెళ్లాలి అన్నది కేంద్ర పెద్దల ఆలోచన. మరి అందులో ఎంతవరకు సక్సెస్ కనిపిస్తుందో చూడాలి.
