Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ కొత్త మార్పులు

CM Jagan: జగన్ కొత్త మార్పులు

CM Jagan: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చడమే కాదు.. పార్టీ సంస్థాగత నిర్మాణాల్లో కూడా జగన్ మార్పులు చేస్తున్నారు. ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లను మార్చారు. తనకు అత్యంత ఆప్తులుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లను తొలగించారు. వారి స్థానంలో విజయసాయిరెడ్డిని నియమించారు. అయితే అది చాలాదన్నట్టు ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న బొత్స సత్యనారాయణను తప్పించారు. ఆయన స్థానంలో వై వి సుబ్బారెడ్డిని నియమించారు. మరోవైపు రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును నియమించడం విశేషం.

జగన్ ప్రాధాన్యతాంశాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇది పార్టీ ఆవిర్భావం నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీలో నాయకులు ఎప్పటికప్పుడు మారడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయంలో నడిచిన నాయకులు చాలామంది ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. అంతెందుకు మొన్నటి వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు కనిపించకుండా ఉన్నారు. ఐదు జాబితాలను స్వయంగా బొత్స సత్యనారాయణ చదివి వినిపించారు. పక్కన సజ్జల ఉండేవారు. ఆరో జాబితాను మాత్రం మేరుగ నాగార్జునతో చదివించారు. పక్కన సజ్జల ఉన్నారు. అయితే ఇప్పుడు బొత్స ఎక్కడికి వెళ్లారు అన్నది ప్రశ్న. చీపురుపల్లి నుంచి ఆయనను తప్పించి.. బెల్లాన చంద్రశేఖర్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే బొత్స కనిపించకుండా పోయారని టాక్ నడుస్తోంది.

ఒక పద్ధతి ప్రకారం బొత్స కుటుంబ ఆధిపత్యాన్ని విజయనగరంలో నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం బొత్స చేతిలో విజయనగరం జిల్లా ఉంది. దానిని ఎలాగైనా తెగ్గొట్టాలన్న భావనతో జగన్ ఉన్నారు. విశాఖ పార్లమెంట్ స్థానం ఇన్చార్జిగా బొత్స ఝాన్సీ లక్ష్మీని నియమించారు. అయితే ఆమె ఎన్నికల్లో అభ్యర్థి అవుతారన్నది అనుమానమే. మరోవైపు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని టాక్ నడిచింది. కానీ ఆయనకు పార్వతిపురం మన్యం జిల్లా కోఆర్డినేటర్ గా నియమించడంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.అయితే బొత్స ఉన్నఫలంగా కనిపించకపోవడం, అభ్యర్థుల ప్రకటన బాధ్యత నుంచి తప్పుకోవడం, అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం బాధ్యతలు నుంచి తొలగించడంతో.. తెర వెనుక ఏదో మంత్రాంగం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి.

జగన్ చేస్తున్న ఈ కొత్త మార్పులు దేనికి సంకేతం అన్న చర్చ పార్టీలో బలంగా నడుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో కొనసాగేలా నియంత్రించలేదని ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. చిలకలూరిపేట టికెట్ ఆశించి.. ఇవ్వకుంటే తన ప్రతాపం చూపిస్తానన్న మర్రి రాజశేఖర్ ను కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి బొత్స సత్యనారాయణను తప్పించడం వెనుక ఏదో ఒక కారణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకు అనారోగ్య కారణాలు చూపి టిక్కెట్ కు మొండి చేయి చూపుతారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version