Homeఆంధ్రప్రదేశ్‌CM YS Jagan : అందరినీ ముంచేసి.. దోచేసి.. ఇప్పుడు అమ్మేస్తున్నాడు!

CM YS Jagan : అందరినీ ముంచేసి.. దోచేసి.. ఇప్పుడు అమ్మేస్తున్నాడు!

ఇన్ని లక్షల మందిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి.. మరోసారి కోర్టుల్ని మోసగించరని ఎలా అనుకోవాలి?  మొత్తానికైతే అగ్రిగోల్డ్ బాధితులకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు యాజమాన్యం నుంచి రిక్తహస్తమే ఎదురైంది. 

CM YS Jagan : గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి అగ్రిగోల్డ్ ఇష్యూ ఒక కారణం. విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసే సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లో ఖాతాదారుల డిపాజిట్లు జమ చేస్తానని ప్రకటించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిందని ప్రచారం చేశారు.దీంతో జగన్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఖాతాదారులు భావించారు. ఏకపక్షంగా ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒకసారి స్వల్పంగా డిపాజిట్ చేసిన జగన్ చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ఏడాది అగ్రిగోల్డ్ యజమాని తెరపైకి వచ్చారు. న్యాయస్థానంలో పిల్ వేయడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఏడాదిలో రూ.6 వేల కోట్లు డిపాజిట్…
తాజాగా ఆస్తులు అమ్మి ఖాతాదారులకు షటిల్ చేస్తానని.. తనకు అనుమతి ఇవ్వాలని అగ్రిగోల్డ్ ఓనర్ అవ్వాస్ వెంకటరామారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆస్తలును అమ్ముకునే అవకాశం ఇస్తే.. ఏడాదిలో ఖాతాదారులకు 1ఆరున్నర వేల కోట్లు డిపాజిట్ చేస్తానని ఆయన చెబుతున్నారు. నిజానికి ఆ ఆస్తులను అమ్మి డిపాజిట్లకు చెల్లించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏదో ఓ అడ్డంకి వస్తూనే ఉంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా యజమాని ముందుకు రావడం అనుమానాలకు తావిస్తోంది.

గతంలో చాలా మంది..
అయితే ఈ తరహాలో గతంలో చాలామంది పారిశ్రామికవేత్తలు, రుణ ఎగవేతదారులు ఖాతాదారులకు, ప్రభుత్వానికి మోసం చేశారు. విజయ్ మాల్యా లాంటి రుణ ఎగవేతదారులు ఈ విధంగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భాలున్నాయి. బ్యాంకులు , దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన తన ఆస్తుల్ని విడిపిస్తే.. చెల్లించాల్సినవన్నీ చెల్లిస్తానని చెప్పుకున్నారు. కానీ అందుకు చట్టపరమైన అంశాలు అడ్డంకిగా మారాయి. న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఓనర్ కూడా అదే చేస్తున్నారు. కానీ కోర్టు నుంచి సానుకూలత వచ్చే అవకాశమే లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం
ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు చెప్పిన మాటలను అగ్రిగోల్డ్ బాధితులు గుర్తుచేసుకుంటున్నారు.అధికారంలోకి రాగానే రూ.1100 కోట్లు డిపాజిట్లు అందిస్తానని ప్రకటించారు.నాలుగేళ్లవుతున్నా అతీగతీలేదు. ఒక వేళ అగ్రీగోల్డ్  ఓనర్ పిటిషన్ కు కోర్టు అనుమతి ఇస్తే.. ఆస్తులన్నీ ఆయనకు అప్పగించాల్సి ఉంటుంది.అప్పుడు ఆయన అమ్ముకుంటారు. ఆ తర్వాత డబ్బులు కడతారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అమ్మితే అంత పెద్ద మొత్తం రాలేదని.. లేకపోతే మరొకటని చెప్పి వ్యవస్థలతో ఆడుకోవచ్చు. ఇన్ని లక్షల మందిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి.. మరోసారి కోర్టుల్ని మోసగించరని ఎలా అనుకోవాలి?  మొత్తానికైతే అగ్రిగోల్డ్ బాధితులకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు యాజమాన్యం నుంచి రిక్తహస్తమే ఎదురైంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper