Chandrababu And Jagan: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) వరుసగా సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. తిరుమల లడ్డు వివాదం ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు శ్రీశైలం ప్రసాదం తయారీకి సంబంధించి వాడిన నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. బాత్రూం శుభ్రం చేసే కెమికల్ వాడారు అంటూ కామెంట్స్ చేశారు. ఇవి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రైవేటు భూమిని కబ్జా చేశారు అంటూ కొత్త విషయాన్ని బయటపెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలో 10 ఎకరాల భూమిని అడ్డగోలుగా ఆక్రమించుకున్నారని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పర్యటనలోనే ఈ సంచలనాలకు తెర తీశారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ వెనుక భాగంలో హెలిపాడ్ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని.. ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి హెలిపాడ్ నిర్మించారు అంటూ నాటి సంగతులను బయటపెట్టారు చంద్రబాబు.
* పది ఎకరాల్లో హెలిప్యాడ్
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ప్రతిపక్ష నేతగా ఉండే సమయంలోనే తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక దానినే అధికారిక కార్యాలయంగా మార్చుకున్నారు. ఆయన ఎక్కువగా హెలిక్యాప్టర్ పై తిరిగేవారు. ఈ క్రమంలో తాడేపల్లి నివాసం చెంతనే పది ఎకరాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ భూమి ప్రైవేటు వ్యక్తిది అని సీఎం చంద్రబాబు బయటపెట్టారు. అయితే తొలుత ఆ భూ యజమాని ఒప్పుకోలేదట. కానీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అది ప్రభుత్వ భూమిగా చూపారట. రాత్రికి రాత్రి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి.. పది ఎకరాల ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేసారట. అప్పట్లో సీఎం జగన్ కార్యాలయం కొనసన్నల్లోనే ఈ స్థాయి ట్యాంపరింగ్ జరిగిందని సీఎం చంద్రబాబు బయటపెట్టారు. ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా చూపి అక్కడ హెలిప్యాడ్ నిర్మించుకోవచ్చు అని భూమి రికార్డుల్లో చూపారట.
* సంచలన అంశాలు..
ఇటీవల చంద్రబాబు ఏ కార్యక్రమానికి హాజరైన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒక వ్యూహం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా అవినీతి, పాలనా లోపాలు జరిగాయంటూ ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇటీవల కూటమిలోని మూడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ఏ సభకు హాజరైన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కర్నూలులో శ్రీశైలం ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ, తాడేపల్లిలో హెలిప్యాడ్ కోసం భూ ఆక్రమణ వంటివి బయట పెట్టారు. రాజకీయంగా ఈ రెండు అంశాలు కాక రేపడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో?
