Chandrababu: తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు గులాబీ పార్టీ భావజాలం ఒక్కటేనని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఆ రెండు పార్టీలు ఒకేసారి ఓడిపోయాయి. రాజకీయ ఉనికి చాటుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఆ రెండు పార్టీలకు సంబంధించి ఆడబిడ్డల పోరు ఉంది. అయితే ఆ రెండు పార్టీల విషయంలో ఏ పరిణామం జరిగినా దాని వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉంటారు అనే ప్రచారం ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తూ ఉంటుంది. వారికి ఎటువంటి చెడు జరిగినా.. అది చంద్రబాబు కుట్ర అని ఆరోపించడం వారికి అలవాటైన విద్య. చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత తన పార్టీ జెండాను పసుపు మయంగా మార్చడం వెనుక కూడా చంద్రబాబు ఉన్నారు అనేది గులాబీ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ.
* అప్పుడు రేవంత్.. ఇప్పుడు కవిత
తెలంగాణకు సంబంధించి గులాబీ పార్టీని ఢీ కొట్టి నిలబడ్డారు రేవంత్ రెడ్డి. అంతకుముందు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అలా రేవంత్ పార్టీ మారడం వెనుక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా రేవంత్ ఎంపిక వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు కవిత తన తండ్రి పార్టీని ఎదిరించి.. బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ జెండా పసుపు మయంగా కనిపిస్తోంది. దీని వెనుక కూడా చంద్రబాబు ఉన్నారు అనేది గులాబీ పార్టీ ఆరోపణ.
* కాంగ్రెస్ నుంచి షర్మిల వరకు..
ఏపీ విషయంలో చెప్పనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే దాని వెనుక చంద్రబాబు ఉన్నారు అనేది జగన్ అనుమానం. వైయస్ కుటుంబంలో వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. దాని వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందారు జగన్ . తర్వాత సొంత కుటుంబ సభ్యులే ఆయనను హతమార్చారని.. వారిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని తల్లి విజయమ్మ, చెల్లెళ్లు షర్మిల, సునీతాలు ఆరోపించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ ఎన్నికలకు ముందు పసుపు చీర కట్టుకుంటే షర్మిల చంద్రబాబు మనిషిగా జగన్ అభివర్ణించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏ పరిణామం జరిగినా.. దాని వెనుక చంద్రబాబు ఉన్నారు అనేది ఆ రెండు పార్టీల అనుమానం.
