Chandrababu cabinet dissolution: ఏపీ మంత్రివర్గంలో( AP cabinet ) లీకు వీరులు ఉన్నారా? మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే లీకులు ఇస్తున్నారా? అటువంటి వారు ఎవరు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందే క్యాబినెట్ అజెండాలోని ముఖ్యంశాలు బయటకు వెళ్లాయి. మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు సీఎం చంద్రబాబు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు అధికారికంగా వెల్లడించక ముందే మీడియాకు ఎలా చేరుతున్నాయని ఆయన మంత్రివర్గ సహచరులను గట్టిగానే ప్రశ్నించారు. సమాచారం లీకు కావడం అనేది ప్రభుత్వ క్రమశిక్షణకు విరుద్ధమని కూడా స్పష్టం చేశారు.
లీకులపై చర్చ..
అయితే మంత్రివర్గంలో నిర్ణయాలను ముందుగానే ఎవరు లీకు చేస్తున్నారు అనేది ఇప్పుడు సరికొత్త హాట్ టాపిక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే మాదిరిగా మంత్రివర్గం నుంచి లీకులు వెళ్లడంతో నందమూరి తారక రామారావు( Nanda Muri Taraka Rama Rao ) సీరియస్ అయ్యారు. ఏకంగా తన మంత్రివర్గాన్ని రద్దు చేశారు. అదే విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్తే.. దానికి సంబంధిత మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృత్తం అయితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఎవరు ఈ లీకులు ఇచ్చారో తేల్చడం చాలా సులువైన పనిగా తేల్చేశారు చంద్రబాబు. తద్వారా లీకులు ఇచ్చిన మంత్రుల వివరాలు ఇప్పటికే సేకరించినట్లు ప్రచారం నడుస్తోంది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. బిజెపి నుంచి ఒకరు, జనసేన నుంచి ముగ్గురు, టిడిపి నుంచి 20 మంది మంత్రులు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. కూటమిపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. పెద్ద ఎత్తున మంత్రులను తొలగిస్తారన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చించాల్సిన అజెండా బయటకు వెళ్ళింది అంటే.. ఎవరైనా మంత్రులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారా? లేకుంటే తమను తొలగిస్తారు అన్న సమాచారం తెలిసిందా? అందుకే లీకులు ఇచ్చారా? అనేది పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ. మొత్తానికి అయితే ఏకంగా చంద్రబాబు నోటి నుంచి మంత్రి వర్గాన్ని రద్దు చేశారు అనే గట్టి హెచ్చరికలు రావడం మాత్రం పొలిటికల్ వర్గాల్లో సరికొత్తగా చర్చ జరుగుతోంది.